
సాక్షి, అమరావతి: ఏపీ టిడ్కో (రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ)పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలో ఉన్న 65,969 ఫ్లాట్ల నిర్మాణంపై రివర్స్ టెండరింగ్ను ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన టెండర్లు తెరిచిన మరుసటి రోజే రివర్స్ టెండర్ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రధాన టెండర్లకు, రివర్స్ టెండర్కు మధ్య ఎక్కువ సమయం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.
కాగా ప్రజాధనం ఆదా, పారదర్శక, అవినీతిరహిత విధానాల్లో వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా ఈనెల 22న 14,368 ఇళ్ల నిర్మాణానికి టెండరింగ్కు వెళ్తున్నామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. దీనికి మరుసటిరోజే రివర్స్టెండరింగ్ను నిర్వహించాలని సీఎం ఆదేశించారు. మిగిలిన ఇళ్లకూ కూడా త్వరలోనే టెండర్లను పిలుస్తామని అధికారులు వివరించారు. గతంలో నిర్దేశించిన నిర్మాణ ప్రమాణాలను అలాగే ఉంచి రివర్స్ టెండరింగ్ పిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఫ్లాట్లు కన్నా పట్టణపేదలకు ప్లాట్లు ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. దీనివల్ల ఫ్లాట్లలో నిర్వహణ పరంగా ప్రస్తుతం ఉన్న సమస్యలు తొలగిపోవడమే కాకుండా పేదలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment