![CM YS Jagan Order To Officials Appoint A Search Committee For University VCs - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/27/YS-JAGAN.jpg.webp?itok=wuRmXI2y)
సాక్షి, అమరావతి : ఫీజు రియింబర్స్మెంట్ వాస్తవిక దృక్పథంతో అమలు చేసినప్పుడే పేద, మధ్యతరగతి పిల్లలు చదువుకోగలుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటలో ఉంచినప్పుడే భవిష్యత్ తరాలు అభివృద్ది చెందుతాయని, అదే మనం మన భవిష్యత్ తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అన్నారు. విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల సత్వర పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చ జరిపారు. పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వసతుల పెంపునకు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అమ్మఒడి పథకం విధివిధానాల రూపకల్పనపై అధికారులతో చర్చించారు. ఇంటర్, ఉన్నత విద్యాశాఖల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ ఫీజులు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్కమిటీలు
యూనివర్శీటీలలో వీసీల ఎంపికకు తక్షణమే సెర్చ్కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 30 రోజుల్లో వీసీలను ఎంపిక చేయాలన్నారు. యూనివర్శీటీల్లోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరినాటికి భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీసీల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని, అర్హత, అనుభవం ఉన్నవారినే వీసీలుగా ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వ యూనివర్శీటీలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సెంట్రల్ ట్రైబట్ యూనివర్శీటీ, గిరిజన మెడికల్ కాలేజీలను అరకులో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచే కొత్త సిలబస్
ఫీజు రియింబర్స్మెంట్ ఫీజులు సమయానికి ఇవ్వడం లేదని, ఏడాది, రెండేళ్లకు ఒకసారి ఇస్తే కాలేజీలు ఎలా బతుకుతాయి అని సీఎం జగన్ అధికారులను ప్రశ్నించారు. ఫీజు రియింబర్స్మెంట్ సకాలంలో చెల్లించినప్పడే పేద విద్యార్థులు చదువుకోగలుతారన్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఫీజు రియింబర్స్మెంట్ ఇచ్చేలా చర్యలు తీసుసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠ్యప్రణాళిక మెరుగుపరచడానికి కమిటీ వేయాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే మార్పు చేసిన సిలబస్ అమల్లోకి రావాలన్నారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ పనుల పూర్తికి, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment