
నా భార్యకు మళ్లీ పెళ్లి చేస్తున్నారు
⇔ నన్ను చంపేస్తామంటున్నారు
⇔ జిల్లా ఎస్పీని కలసినా ఫలితం లేదు
⇔ విలేకరులతో వాపోయిన బాధితుడు
చిత్తూరు : మేమిద్దరూ ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నాం. దీన్ని పెద్దలు నేరంగా భావించి మమ్మల్ని విడదీశారు. నా భార్యను ఎక్కడో దాచిపెట్టారు. ఆమెకు మళ్లీ పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామంలోకి వచ్చే నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. జిల్లా ఎస్పీని కలిసినా ఫలి తం లేదు’ అని ఎర్రావారిపాళెం మండలం ఎరుకలపల్లెకు చెందిన ఇసుకపల్లి బాలరాజు శనివారం విలేకరుల ఎదుట వాపోయాడు. అతని కథనం మేరకు.. ఉదయమాణిక్యం పంచాయతీ ఎరుకలపల్లెకు చెందిన ఎం.రూపారాణి(21), అదే గ్రామానికి చెందిన బాలరాజు(23) పక్కపక్క ఇళ్లలో ఉంటారు.
వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇద్దరి ఇళ్లలోనూ చెప్పారు. కులాలు వేరుకావడంతో పెళ్లికి వారు అంగీకరించలేదు. పైగా బెదిరించారు. దీంతో వారు ఇంటి నుంచి పారిపోయి ఈ నెల 12న మదనపల్లె సమీపంలోని ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి రక్షణ కల్పించా లని 16న జిల్లా ఎస్పీని కలిసి విన్నవించారు. వారికి రక్షణ కల్పించాలని ఎస్పీ మదనపల్లె డీఎస్పీ రాజేంద్రప్రసాద్ను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రేమజంట ఎర్రావారిపాళెం పోలీ సులు సహాయం కోసం 17న వెళుతుండగా విషయం తెలుసుకున్న యువతి బంధువులు, అన్న, మామ వారిని తిరుపతి జూపార్క్ సమీపంలో అడ్డుకున్నారు.
బాలరాజుపై దాడి చేసి రూపారాణిని తీసుకెళ్లారు. ఆమె కోసం వస్తే చంపేస్తామని బెదిరించారు. బాధితుడు ఎర్రావారిపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోలే దు. ఈ నేపథ్యంలో రూపారాణికి తల్లిదండ్రులు మళ్లీ పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు బాలరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని వారు బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని వాపోయాడు.