
వసతి గృహం కేర్ టేకర్, కోడలితో రామదాసు (మధ్యలోని వ్యక్తి)
అల్లిపురం(విశాఖ దక్షిణం): భర్త ఇంటిని పట్టించుకోకపోవడంతో విసిగి సొంత మామ భారమనుకుందో ఏమో ఆ కోడలు.. ఆయన అనాథని చెప్పి నిరాశ్రయుల వసతి గృహం సిబ్బందికి అప్పగించి వెళ్లిపోయింది. అయితే తన కోడలే తనను ఇక్కడ చేర్పించిందని వృద్ధుడు చెప్పడంతో భీమ్నగర్ డిస్పెన్సరీ సిబ్బంది అవాక్కయ్యారు. గురువారం ఆమెను పిలిపించి మందలించి ఆయనను తిరిగి అప్పగించారు. భీమ్నగర్ వసతి గృహం నిర్వాహకురాలు మమత తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం రామదాసు అనే 67 ఏళ్ల వృద్ధుడిని అతని కోడలు అనాథని చెప్పి తీసుకొచ్చింది.
అతడు రోడ్డు మీద పడుకుండగా తాను చూశానని చెప్పి, అతడితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిలా భీమ్నగర్ షెల్టర్కు తీసుకు వచ్చి అప్పగించి వెళ్లిపోయింది. షెల్టర్ సిబ్బంది తర్వాత ఆ వృద్ధుడిని ప్రశ్నించగా.. తన కోడలే తనను అనాథని చెప్పి ఇక్కడ చేర్పించిందని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. వెంటనే వారు ఆమెను గురువారం పిలిపించారు. ఆమెను కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా మళ్లీ ఇలాంటి పనులు పునరావృతం కాకూడదని హెచ్చరించి, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అతడిని ఆమె వెంట పంపించారు. రామదాసు షెల్టర్ నుంచి వెళ్తూ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment