
గ్రామం భస్మీపటలం
గూడూరు మండలం నాగవరంలో ఘోర అగ్నిప్రమాదం
42 ఇళ్లు, 25 పశువుల పాకలు దగ్ధం
రూ.2 కోట్లకు పైగా నష్టం
56 కుటుంబాలు నిరాశ్రయం
పెళ్లింట విషాదం
అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఊరంతా వ్యాపించాయి. గంటల వ్యవధిలో 42 ఇళ్లు బుగ్గిపాలయ్యాయి. మరో 25 పశువుల పాకలు దగ్ధమయ్యాయి. రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మొత్తం 56 కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. కళ్లముందే సర్వస్వం కోల్పోవడంతో బాధితులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన వ్యక్తి కుమార్తె వివాహం తిరుపతిలో జరగాల్సి ఉండగా పెళ్లి ఏర్పాట్లలో కుటుంబసభ్యులు నిమగ్నమై ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. పెళ్లిపందిరి సహా గృహం కూడా కాలిబూడిదైంది. వివాహం కోసం సిద్ధంగా ఉంచిన నగదు, బంగారం, పెళ్లి సామగ్రి బుగ్గిపాలయ్యాయి.
గూడూరు మండలం ముక్కొల్లు శివారు నాగవరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా గ్రామం మొత్తాన్ని మంటలు చుట్టుముట్టడంతో పాటు వడగాలులు తోడవ్వటంతో 42 గృహాల్లోని 56 కుటుంబాల వారు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. కష్టపడి పండించిన ధాన్యం, మినుములు కాలిబూడిదయ్యాయి. దాచుకున్న నగదు, బంగారువస్తువులు, గృహోపకరణాలు మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యాయి. ఉపాధి పనులు చేస్తున్న కూలీలు, పశువులను మేపేందుకు వెళ్లిన వారు ప్రమాద సంఘటనను తెలుసుకుని గ్రామంలోకి వచ్చేసరికే మంటలు ఊరంతా వ్యాపించాయి. వేసవి కావటంతో గ్రామం చుట్టుపక్కల ఎక్కడా నీరు లభ్యం కాకపోవటంతో మంటలను అదుపు చేయటం కష్టమైంది. గుడ్లవల్లేరు, మచిలీపట్నం, గుడివాడ, పామర్రుల నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
10.30 గంటలకు ప్రమాదం:
మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో నాగవరం గ్రామానికి చెందిన బాడిగ వీరప్రసాద్కు చెందిన వరి గడ్డివామికి నిప్పు అంటుకుంది. ముందుగా వీరప్రసాద్కు చెందిన గృహం, పశువులపాకకు నిప్పు అంటుకుంది. అక్కడి నుంచి మంటలు గ్రామమంతా వ్యాపించాయి.ఒక్కసారిగా గ్రామం మొత్తం మంటలు వ్యాపించటంతో అక్కడి వారంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. మంటలు గ్రామమంతా వ్యాపించడంతో కొందరు యువకులు గృహాల్లోని గ్యాస్ సిలిండర్లను రోడ్డు పైకి విసిరేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
వివాహ పనుల్లో నిమగ్నమై ఉండగా ...
గ్రామానికి చెందిన బాడిగ మహంకాళిరావు తన కుమార్తె రజనీ వివాహం బుధవారం రాత్రి తిరుపతిలో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికి ఇవ్వాల్సిన కట్నకానుకలు, బంగారు నగలు, భోజనాలకు కావాల్సిన నిత్యావసర సరుకలు సిద్ధంగా ఉంచుకున్నారు. ఊహించని విధంగా గ్రామంలో మంటలు చెలరేగటంతో మహంకాళరావు ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరితో సహా గృహం కాలిబూడిదైంది. వివాహం కోసం సిద్ధంగా ఉంచుకున్న రూ. 1.50 లక్షల నగదు, ఐదు నవర్సుల బంగారం, పెళ్లి సామానులు కాలిబూడిదయ్యాయి. దీంతో ఈ కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు.
సహాయ చర్యల్లో నిమగ్నమైన
అధికారులు :
నాగవరం గ్రామంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం సంఘటనలో బాధితులను ఆదుకునేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బందరు ఆర్డీవో పి సాయిబాబు, గూడూరు తహశీల్దార్ బీఎల్ఎన్.రాజకుమారి, గుడివాడ డీఎస్పీ నాగన్న, బందరు రూరల్ సీఐ వీవీఎస్ఎన్ మూర్తి, పలువురు ఎస్సైలు గ్రామానికి వచ్చి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సర్వస్వం కోల్పోయిన బాధితులు కోరుకున్న చోట పునరావాస శిబిరం ఏర్పాటు చేసి సహాయక చర్యలు వేగవంతం చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.ప్రమాదంలో నష్టం అంచనాలను తయారు చేస్తున్నామని సుమారు రెండు కోట్ల రూపాయల వరకు నష్టం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
గ్రామంలో ఉద్రిక్తత :
నాగవరం గ్రామంలో ఉన్న ఊరచెరువుల ఫలసాయం పొందే విషయంలో రెండు సామాజికవర్గాల నడుమ కొంత కాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత నెలన్నర వ్యవధిలో ఐదు వరి గడ్డివామిలు దగ్ధమయ్యాయి. కొంత మంది కావాలనే వరిగడ్డి వామిలను దగ్ధం చేశారనే కారణంతో పోలీసుల కేసు వరకు వెళ్లింది. బందరు రూరల్ సీఐ మూర్తి, గూడూరు ఎస్సై ఎ ఫణిమోహన్, రెవెన్యూ అధికారులు ఇరువర్గాలను పిలిపించి గ్రామంలో ఎలాంటి అలజడులు రేగకుండా సామరస్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటు చేసిన 15 రోజుల వ్యవధిలోనే గ్రామంలోని గృహాలకు నిప్పు అంటుకోవటం వివాదాస్పదమైంది. ఓ వైపు గృహాలు అగ్నిప్రమాదంలో తగలబడుతుంటే మరో వైపు రెండు వర్గాలు ఈ సంఘటనకు మీరంటే మీరు కారణమంటూ పోలీసులు, అధికారుల ఎదుటే వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొని పరిస్థితి చేయదాటే స్థితికి వచ్చింది. గుడివాడ డీఎస్పీ నాగన్న, బందరు రూరల్ సీఐ మూర్తి గ్రామస్తులకు సర్ధిచెప్పారు. ఇరువర్గాలకు చెందిన కొంత మందిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టండి : ఎమ్మెల్యే కాగిత
గూడూరు : గూడూరు మండలం నాగవరం గ్రామంలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు అందించాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అధికారులను ఆదేశించారు. అస్వస్తత కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే ఫోన్లో బందరు ఆర్డీవో సాయిబాబు, గూడూరు తహశీల్దార్ బీఎల్ఎన్.రాజకుమారిలతో మాట్లాడి సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహించకుండా అన్ని విధాల పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు.
పలువురి పరామర్శ :
నాగవరం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం బాధితులను పలువురు నాయకులు పరామర్శించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు బూరగడ్డ శ్రీకుమార్, లేళ్లగరువు పీఏసీఎస్ అధ్యక్షులు గుడివాడ సుబ్రహ్మణ్యేశ్వరరావు, గ్రామసర్పంచి సమ్మెట ఈశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు పోతన స్వామి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోపీ నాగబాబు, రామరాజుపాలెం ఎంపీటీసీ సభ్యులు కాసగాని శ్రీను తదితరులు బాధితులను పరామర్శించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.