పాత కోటానే గోదాంకు పంపిన అధికారులు ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీకి బ్రేక్!! మార్చి నెల కోటా గోదాంకే పరిమితం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటున్న అధికారులు
పాత కోటానే గోదాంకు పంపిన అధికారులు ఎన్నికల కోడ్ కారణంగా పంపిణీకి బ్రేక్!! మార్చి నెల కోటా గోదాంకే పరిమితం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామంటున్న అధికారులు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు నేపథ్యంలో రేషన్ సరుకుల పంపిణీకి బ్రేక్ పడింది. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఖరారైన క్రమంలో ‘కోడ్’ అమల్లోకి వచ్చింది. దీంతో పేద వర్గాలకు నూనె, గోధుమ పిండి, గోధుమల పంపిణీ ఆగిపోయింది. విచిత్రమేటంటే ముఖ్యమంత్రి పదవికి ఇటీవల కిరణ్కుమార్రెడ్డి రాజీనామా చేశారు.
ఆయన ఇప్పుడు మాజీ సీఎం. అయినా సివిల్ సప్లయ్కి కిరణ్ ఇంకా సీఎంగా ఉన్నట్టున్నారు. రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్న సబ్సిడీ వంటనూనె ప్యాకెట్లపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిగా ఆయన ఫొటో, శ్రీధర్బాబు ఫొటోలు అలాగే ఉండటమే ఇందుకు ఉదాహరణ. ఈ ఇద్దరూ ఇప్పుడు మాజీలే. పాత స్టాక్ను అలాగే సివిల్ సప్లయ్ గోదాంలకు అధికారులు పంపించారు. ఈ ఫొటోలను గమనించిన సివిల్ సప్లయ్ అధికారులు సరుకులను డీలర్లకు సరఫరా చేయొద్దని గోదాం ఇన్చార్జిలకు ఆదేశాలిచ్చారు.
మార్చి నెల కోటా నూనె, ఇతర సరుకులను తీసుకువెళ్లేందుకు గోదాం వద్దకు వస్తున్న రేషన్ డీలర్లకు ఎన్నికల కోడ్తో సరుకులను ఇవ్వడంలేదని అధికారులు సమాధానం చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకు డీడీలు కట్టాం.
సరుకులు లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పుడు కోడ్ ఉందని ఆపేస్తే లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలని పలువురు డీలర్ల ప్రశ్నిసున్నారు. ఎలాంటి ఫొటోలు లేని సరుకుల ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు సివిల్ సప్లయ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే లబ్ధిదారులకు సరుకుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా? లేదా? ఎన్నికల హడావుడిలో సివిల్ సప్లయ్ శాఖ అసలు విషయం మర్చిపోతుందా వేచి చూడాల్సిందే.
తాండూరు నియోజకవర్గంలో 150 రేషన్ దుకాణాలకు మార్చి నెల కోటా కింద లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన 15 వేల నూనె ప్యాకెట్లు, 1000 ప్యాకెట్ల గోధుమ పిండి, 500 ప్యాకెట్ల గోధుమలు, ఇంకా ఉప్పు ప్యాకెట్లు ఎన్నికల కోడ్ కారణంగా గోదాంకే పరిమితమయ్యాయి.