గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో తొలి పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక జలాలతో అభిషేకాలు చేశారు.
పెనుగంచిప్రోలు, న్యూస్లైన్: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో తొలి పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ఈవో ఎన్.విజయ్కుమార్, చైర్మన్ నెల్లూరి గోపాలరావు గణపతి పూజ అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. తొలిసారిగా పవిత్రోత్సవాలు నిర్వహించనుండడంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు.
ఉదయం మండపారాధన, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రికి ఆలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు, పంచహారతుల అనంతరం దేవతామూర్తులకు పవిత్రములు ధరింపజేశారు. ఉత్సవాల ప్రారంభంతోపాటు శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈఓలు ప్రసాదరావు, గోపాలరావు, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు.