
రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబోతోందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
సాక్షి, హైదరాబాద్ : సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా మంత్రి మండలి ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బలహీన, మైనారిటీ వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత కల్పించటం అభినందనీయమని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత, రెబల్స్టార్ కృష్ణంరాజు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఐదుగురు ఉపముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం మీ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమని కొనియాడారు. ఎవరూ ఊహించని విధంగా ఎనిమిది మంది బీసీలకు, ఐదుగురు ఎస్సీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం భవిష్యత్తు రాజకీయాలకు మార్గదర్శకంగా భావిస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు.
'పరిణతి చెందిన ప్రజానాయకుడిగా మీరు స్పీకర్ పదవి బీసీలకు, డిప్యూటీ స్పీకర్ పదవి బ్రాహ్మణులకు కేటాయించడం చాలా మంచి నిర్ణయం. ప్రజల అఖండ అభిమానం చూరగొన్న నాయకుడిగా.. పిన్న వయసులోనే ప్రజానేతగా ఎదిగిన మీరు 'రాజకీయాల్లో రియల్ హీరో'.. మీరు, మీ మంత్రిమండలి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలనే ధ్యేయంగా ముందడుగు వేస్తారని నా గట్టి నమ్మకం. రాష్ట్ర పురోభివృద్ధిలో మీ పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబోతోందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోకి ముఖ్యమంత్రి హోదాలో మీరు తొలిసారిగా అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని కృష్ణంరాజు పేర్కొన్నారు.