ఏపీ శాసన మండలిలో పలువురు సభ్యులు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి కోపగిస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతాంగాన్ని శాపనార్ధాలు పెడితే ఎలా అని ఏపీ శాసనమండలిలో పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఏపీలో నెలకొన్న కరువు పరిస్థితిపై శాసన మండలిలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో చర్చ ప్రారంభమైనా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అధికారులు సభలో లేకపోవటంపై మండలి వైస్ చైర్మన్ ఎస్.వి.సతీష్కుమార్రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. ఆయన సూచనతో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెంటనే అధికారులను రప్పించి చర్చను కొనసాగించారు. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ పదేపదే ప్రకటనలు చేసి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు.
పంటలు పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కనీసం వాటిని నమోదు చేయడానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. అనంతపురం జిల్లా రైతులను ఆదుకునేందుకు బీమా విధానంలో మార్పులు తేవాలని టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. ఆధార్ కార్డులు లేని వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ కట్ చేస్తే రైతు ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదముందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు బ్యాంకు ల్లో అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వామపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆరోపించారు. తాగునీటి కోసం చిత్తూరు జిల్లాలో నిర్మించ తలపెట్టిన కండలేరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యుడు రెడ్డెపరెడ్డి డిమాండ్ చేశారు.
ఆదుకోకుండా శాపనార్థాలా?
Published Sat, Dec 20 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement