‘పాము’ కాదు.. అవినీతి అనకొండ | More than Rs 800 crore assets are recognized | Sakshi
Sakshi News home page

‘పాము’ కాదు.. అవినీతి అనకొండ

Published Sun, Jun 25 2017 1:00 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

‘పాము’ కాదు.. అవినీతి అనకొండ - Sakshi

‘పాము’ కాదు.. అవినీతి అనకొండ

- పాండురంగారావును సర్వీసు నుంచి తొలగింపునకు సిఫారసు
మాజీ మంత్రికి బినామీగా అనుమానం!
ముగిసిన సోదాలు..రూ.800 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
 
సాక్షి, అమరావతి: అక్రమాస్తులను పెద్దఎత్తున కూడబెట్టిన పురపాలక శాఖ ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ పాము పాండురంగారావు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోని మంత్రులు, మాజీ మంత్రులకు బినామీగా ఉన్నారనే అనుమానాలు రేగుతున్నాయి. రూ.800 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన పాండురంగారావు వెనుక ఉన్న పెద్దలు ఎవరన్న కోణంలో ఏసీబీ దృష్టి సారించకపోవడం గమనార్హం. శుక్ర, శనివారాల్లో సోదాలు నిర్వహించిన సోదాల్లో ఆస్తుల చిట్టాను లెక్కతేల్చిన ఏసీబీ ఆయన ఎవరికి బినామీ, మరికొన్ని కీలక కోణాలపై ఏసీబీ అధికారులు ఆరా తీయడం మరిచారు.

రాష్ట్రానికి చెందిన కీలక మంత్రితో పాండురంగారావుకు ఇటీవల పొరపొచ్ఛాలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పాండురంగారావుకు చెక్‌ పెట్టేందుకు ఆ మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదలిపినట్టు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే కృష్ణా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో కీలకస్థానంలో ఉన్న వ్యక్తికి పాండురంగారావు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు. 2011లో పాండురంగారావు బదిలీని ఆ నేతే స్వయంగా రంగంలోకి దిగి నిలుపుదల చేయించినట్టు సమాచారం. అనంతరం 2014 ఎన్నికల్లో కృష్ణా జిల్లాకు చెందిన ఆ నేతకు పాండురంగారావు ఇతోధిక సాయం అందించినట్టు ప్రచారం జరుగుతోంది. పాండురంగారావుకు ఏపీలోని పలువురు కీలక నేతలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్య నాయకునిగా వ్యవహరించిన తెలంగాణ నాయకుడు, అప్పట్లో మంత్రిగా కూడా వ్యవహరించిన మరో తెలంగాణ నేతకు ఆయన బినామీగా వ్యవహరించారనేది విశ్వసనీయ సమాచారం. పాండురంగారావు హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోనూ కీలక స్థానంలో పనిచేశారు.

ఈ అంశాలపై ఏసీబీ, పోలీసు, ఇతర ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం.  ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపర్చడంతో రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ఇంకా అనేక వివరాలు తెలియాల్సి ఉందని, విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని కోరనున్నట్టు సమాచారం. ఆయన్ను సర్వీసు నుంచి తొలగించాలని ఏసీబీ డీజీ ఆర్‌పీ ఠాకూర్‌ ప్రభుత్వానికి నివేదించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement