ప్రభుత్వ భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు.
రెవెన్యూ అధికారుల తీరుపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే నారాయణస్వామి
పెనుమూరు: ప్రభుత్వ భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె.నారాయణస్వామి అన్నారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నెల కొన్న రెవెన్యూ సమస్యలపై ఆయన జీరో అవర్లో మాట్లాడారు. పెనుమూ రు, వెదురుకుప్పం, గంగాధరనెల్లూరు, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, కార్వేటినగరం మండలాల్లో విలువైన ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని చెప్పారు. ఈ విషయం జిల్లా కలెక్టర్కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే జేసీ, ఆర్డీవోలకు లిఖిత రూపంలో వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదన్నారు. వెదురుకుప్పంలో 153/1 సర్వే నంబర్లో 3.75 ఎకరాలు, 148/8 లో 1.25 ఎకరాలు, 210/1లో 0.75 సెంట్ల భూమి పూర్తిగా ఆక్రమణకు గురైందన్నారు. జీడీనెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లెలో 310/1,2,3,4 సర్వే నంబర్లలో 5.73 ఎకరాల భూమి ఒకే వ్యక్తి ఆక్రమించుకున్నాడని చెప్పారు. ఈ ప్రభుత్వ భూమి ని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని ఆర్టీవో, జాయింట్ కలెక్టర్కు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. పెనుమూరులో 430 సర్వే నంబర్లో 2.93 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి రెవెన్యూ అధికారుల అండతో సర్వే నంబర్ మార్చి ఆక్రమించుకున్నాడని చెప్పారు.
సుమారు రూ.2 కోట్ల విలువైన ఈ భూమిని ‘నీరు- చెట్టు’ పథకం కింద అభివృద్ధి చేసి దర్జాగా ప్లాట్లు వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వెదురుకుప్పం మండలం తిరుమలయ్య పల్లె పంచాయతీ మాకమాంబాపురంలో 42 మంది రైతులకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా మరో వ్యక్తిపై ఆన్లైన్లో భూమి ఎక్కిందన్నారు. ఈ విషయం జేసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. దీనికి రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ సర్వే నంబర్లుతో సహా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల వివరాలు లిఖిత రూపంగా తమకు సమర్పిస్తే ఆక్రమణ అడ్డుకుని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.