
సెంట్రల్ జైలులోని ఓపెన్ ఎయిర్ జైలులో కూరగాయలను పండిస్తున్న ఖైదీలు (ఫైల్)
తూర్పుగోదావరి,రాజమహేంద్రవరం క్రైం: కేంద్ర కారాగారంలో ఖైదీలు కూరగాయలు, ఆకు కూరలు, నర్సరీ మొక్కలను సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలోని ఓపెన్ ఎయిర్ (ఆరుబయలు) జైలు ఉంది. దీనిలో సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను ఉంచుతారు. ప్రస్తుతం 45 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో కొంత మంది పెట్రోల్ బంకుల్లో పని చేస్తుండగా మిగిలిన ఖైదీలు వ్యవసాయం, డెయిరీ తదితర చోట్ల పని చేస్తున్నారు. సెంట్రల్ జైలు ఆవరణలో ఉన్న సుమారు 20 ఎకరాల్లో వంగ తోటలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, బీరు, కాకర, దొండ కాయలు, ఆకుకూరలు తదితర పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు మామిడితోటలు, పనస, కొబ్బరి చెట్లు, పండ్ల తోటలు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నారు.
దీంతో ఇక్కడ నాణ్యమైన కూరగాయలు పండుతున్నాయి. వీటిని సెంట్రల్ జైలులోని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన కాయగూరలను స్థానికంగా అమ్మున్నట్టు జైలుæ సూపరింటెండెంట్ రాజారావు పేర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం కూరగాయలు, పండ్ల తోటల నుంచి రూ.30 లక్షల వరకూ ఆదాయం లభిస్తోందన్నారు. ఇక్కడ తయారు చేసిన సేంద్రియ ఎరువులు సైతం ప్యాకెట్ల ద్వారా అమ్మున్నారు. ఏటా మామిడి తోటపై సుమారు రూ.6 లక్షల వరకూ ఆదాయం లభిస్తుంది. జైలులో ఉన్న డెయిరీ ద్వారా ప్రతీ రోజు 200 లీటర్ల పాలు సేకరిస్తున్నారు. వీటిని జైలులో ఖైదీలకు ఉపయోగిస్తున్నారు. ఈ పాలతో పాటు గుడ్లనూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీలకు సరఫరా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment