
సాక్షి, విశాఖపట్నం: గల్ఫ్ ఆఫ్ మర్తబాన్ ప్రాంతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. మరోవైపు రాయలసీమపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రానున్న రెండు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో పలమనేరులో 11, పుంగనూరు 10, శాంతిపురం 9, లేపాక్షి, తిరుపతి, ఆళ్లగడ్డల్లో 8, పాలసముద్రం, గజపతినగరం, అగళిలో 7, కుప్పం, అమరాపురం, సూళ్లూరుపేట, రాజమంహేంద్రవరంలో 6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment