
సాక్షి, రాజమహేంద్రవరం : స్వాతంత్య్ర సంగ్రామంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర పోరాటం చేసిన యోధులను ఈ జైలులోనే ఉంచే వారు. అతి పురాతనమైన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఒకప్పుడు డచ్ వారికి కోటగా ఉండేది. అనంతరం దీనిని జిల్లా జైలుగా, 1857లో సెంట్రల్ జైలుగా మార్పు చెందింది. అప్పట్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు మద్రాస్ ప్రావెన్సీలో ఉండేది. 1890లో 37.2 ఎకరాల స్థలంలో జైలు బిల్డింగ్లు నిర్మించారు. జైలు మొత్తం 212 ఎకరాల సువిశాలమైన మైదానంలో నిర్మించారు.
1956లో ప్రత్యేకంగా జైలు ప్రాంగణంలో మహిళా సెంట్రల్ జైలును నిర్మించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు ఈ జైలు లో శిక్ష అనుభవించారు. వారిలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి, కళావెంకట్రావు, నడింపల్లి సుబ్బరాజు, బిక్కిన వెంకటరత్నం, ఆరుమిల్లి వెంకటరత్నం, బ్రహ్మజ్యోసుల సుబ్రహ్మణ్యం, మల్లిపూడి పల్లంరాజు, ఐ.ఆర్.చెలికాని వెంకటరామణరావు, మద్దూరి అన్నపూర్ణయ్య, క్రొవ్విడి లింగరాజు, ఏ.బి. నాగేశ్వరరావు, శ్రీమతి దువ్వూరి సుబ్బాయమ్మ, మెసలకంటి తిరుమల రావు, తగ్గిపండు వీరయ్య దొర, టి.ప్రకాశం నాయుడు, మాగంటి బాపినాయుడు, అడవి బాపిరాజు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఎన్జీ రంగా వంటి ప్రముఖులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో స్వాతంత్య్ర సమరయోధులు గా జైలు జీవితం గడిపారు.