
ఇక ప్రభుత్వ ఆస్పత్రులుగా రిమ్స్!
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సెమీ అటానమస్ సంస్థలుగా కొనసాగుతున్న రాజీవ్గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ (రిమ్స్) మూడు ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం శ్రీకాకుళంలో రిమ్స్లో మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి కామినేని విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులు ఆసుపత్రికి వెళ్లేందుకు మండలానికి ఒక ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సోంపేట సహా రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్తగా డయాలసిస్ యూనిట్లు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోనూ విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల స్థితిపై ప్రత్యేక వైద్య బృందంతో అధ్యయనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన అల్టిమేటం ఇచ్చాక తామేం చెబుతామన్నారు.