
సాక్షి, ఒంగోలు ప్రతినిధి: జిల్లాలో పోలీస్ ప్రక్షాళన మొదలైంది.. జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ దూకుడు పెంచారు.. అవినీతి పోలీస్ అధికారులు, సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. ముందుగా తన కార్యాలయం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. ఎస్పీ కార్యాలయంలో అంతర్గత బదిలీలు నిర్వహించిన అనంతరం సీసీఎస్, ఎస్బీ విభాగాల్లో ప్రక్షాళన షురూ చేశారు. సీసీఎస్లో అదనంగా ఉన్న సిబ్బందిని తొలగించడంతోపాటు ఉన్న సిబ్బందిని మూడు బృందాలుగా విభజించాలని నిర్ణయించారు. నేషనల్ హైవే స్క్వాడ్ను పూర్తిగా తొలగించి అక్కడ సిబ్బందిని సైతం ఆయా పోలీస్స్టేషన్లకు కేటాయించారు. ఇకమీదట హైవేలపై మూడు షిఫ్టులుగా విధులు నిర్వహించేలా ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి డ్యూటీలు ఫిక్స్ చేసే పనిలో పడ్డారు.
ఐడీ పార్టీ పోలీసులు పోలీస్స్టేషన్లలో అధికారులకు డబ్బులు వసూలు చేసి పెడుతున్నట్లు గుర్తించిన ఎస్పీ వారిని పూర్తిగా తొలగించిన విషయం తెలిసిందే. ఒంగోలు నగరాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ వేర్వేరుగా ఉన్న కంట్రోల్ రూమ్లను ఒక్కచోట చేర్చి ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఈ విధానం సత్ఫలితాలు ఇస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్న ఎస్బీ సీఐ శ్రీకాంత్బాబు
ఒంగోలు నగరం నేషనల్ హైవేకు పక్కనే ఉండటంతో హైవే పెట్రోలింగ్ బృందాలు గస్తీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ విధులు నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది పోటీపడుతూ పోస్టింగ్ల కోసం పైరవీలు చేస్తుండటాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ నేషనల్ హైవే స్క్వాడ్ను పూర్తిగా తొలగించి సిబ్బందిని సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చారు. సబ్డివిజన్ స్థాయిలో సిబ్బందికి విధులు కేటాయించి, ఒక్కొక్కరు ఎనిమిది గంటల చొప్పున పనిచేసేలా మూడు షిఫ్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దీని వల్ల అవినీతిని అరికట్టడంతోపాటు సిబ్బంది కొరత తీరుతుందనేది ఎస్పీ ఆలోచనగా ఉంది. ఇప్పటి వరకూ పోలీస్ స్టేషన్లలో హవా కొనసాగించిన ఐడీ పార్టీల అవినీతి వ్యవహారాలపై కన్నెర్ర చేసిన ఎస్పీ ఆ వ్యవస్థనే రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్లో సైతం సమూల మార్పులు తీసుకువచ్చి సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఎస్పీ యోచిస్తున్నారు. ఎస్పీ దూకుడుతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పు చేసిన వారిని వదిలి పెట్టనంటూ ఆయన చేస్తున్న హెచ్చరికలతో పోలీస్ వర్గాల్లో వణుకు మొదలైంది.
నిఘా నీడలోకి ఒంగోలు నగరం:
నగరంలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అక్కడక్కడా పనిచేయకపోవడం, కెమెరాల సంఖ్య తక్కువగా ఉండటంతో నగరంలో సంచరించే నేరస్తులపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచలేక పోతున్నారు. దీన్ని గమనించిన ఎస్పీ సిద్దార్థ కౌశల్ నగరం మొత్తం నిఘా నిడాలో ఉండేలా చేసేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా నగరంలో ఎన్ని ప్రాంతాలు సీసీ కెమెరా పరిధిలో లేవో గుర్తించేందుకు సమగ్ర సర్వే చేయిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నగరం మొత్తం నిఘా నీడలోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. దీనిపై డీజీపీ, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి నగరం మొత్తం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎస్పీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో సత్ఫలితాలు:
పోలీస్ శాఖ పరిధిలో ఉన్న అన్ని కంట్రోల్ రూమ్లను ఒక్కచోటకు చేర్చి జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ తన కార్యాలయంలో ఎస్బీ సీఐ పర్యవేక్షణలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులు, టీవీ చానళ్లలో వచ్చే స్క్రోలింగ్లు పర్యవేక్షించే విభాగం, పోలీస్ వాట్సప్, ఫేస్బుక్ల ద్వారా వచ్చే ఫిర్యాదులు పర్యవేక్షించే విభాగం, పోలీస్ రేడియో కంట్రోల్, మీడియా, ఇతర వాట్స్ యాప్ గ్రూప్ల్లో వచ్చే సమాచారం ఆధారంగా స్పందించే బృందాలు, రక్షక్, బ్లూకోట్స్ ఇలా అన్ని విభాగాలనూ అనుసంధానం చేస్తూ ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నిర్ణయం సత్ఫలితాలు ఇస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ముం దుకు వెళ్తున్నారు. నగరంలో బుధవారం ఆటోలో ప్రయాణించిన ఓ ఉపాధ్యాయురాలు సెల్ఫోన్ పోగొట్టుకున్నట్లు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందడంతో వేగంగా స్పందించిన బృందాలు సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా సెల్ఫోన్ను కనిపెట్టి ఆమెకు అందించారు.
సీసీఎస్లో సిబ్బంది కట్:
సీసీఎస్లో ప్రస్తుతం ఉన్న 60 మంది సిబ్బందిని సగానికి తగ్గించి మిగతా వారిని ఆయా పోలీస్స్టేషన్లకు కేటాయించాలని ఎస్పీ సిద్దార్థ కౌశల్ నిర్ణయిం చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సీసీఎస్ సిబ్బందికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. సుమారు 35 మంది సిబ్బందిని మాత్రమే సీసీఎస్లో ఉంచాలని ఎస్పీ భావిస్తున్నారు. వీరిని మూడు క్రైమ్ బృందాలుగా ఏర్పాటు చేసి విధులు కేటాయించడం ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందనేది ఎస్పీ ఆలోచనగా ఉంది. దీనికితోడు స్పెషల్ బ్రాంచ్పైనా ఎస్పీ ఓ కన్నేశారు. అవినీతికి తావు లేకుండా ఎస్బీని ప్రక్షాళన చేయాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment