నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్గా ఎన్.వి. సురేంద్రబాబు బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.
విజయవాడ సిటీ : నగర ఇన్చార్జి పోలీసు కమిషనర్గా ఎన్.వి. సురేంద్రబాబు బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ గౌతమ్ సవాంగ్ వ్యక్తిగత కారణాలపై 13 రోజులు సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జిగా సురేంద్రబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 7 గంటల సమయంలో కమిషనరేట్కు చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. డీసీపీలు ఎల్.కాళిదాసు, జి.వి.జి.అశోక్కుమార్ సహా అధికారులతో సమావేశమై కమిషనరేట్ పరిస్థితులపై సమీక్షించారు. ఉదయం రాజీవ్గాంధీ హోల్సేల్ మార్కెట్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం గురించి అధికారులను అడిగి వివరాలు తెలసుకున్నారు. గతంలో నగర సీపీగా పనిచేసిన సురేంద్రబాబుకు ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది.
తన హయాంలో రౌడీలపై ఉక్కుపాదం మోపారు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే వారిని అణచివేయడంలో ఆయన తనదైన ముద్ర చూపించారు. రాష్ట్రంలో నేడు కలకలం రేపుతున్న కాల్మనీ, వడ్డీ వ్యాపారంపై తొలుత కొరడా ఝళిపించిన వ్యక్తి సురేంద్రబాబే. అప్పట్లో ఆయన పేరు వింటేనే వడ్డీ వ్యాపారులు హడలి పోయేవారు.
అధికారులకు హడల్
ముక్కుసూటిగా వ్యవహరించే సురేంద్ర బాబు అంటే అధికారులకు కూడా హడలని చెప్పొచ్చు. విధుల నిర్వహణలో అలక్ష్యం చూపే అధికారులు, సిబ్బందిపై కఠిన వైఖరి అవలంభిస్తారనే పేరు ఆయనకు ఉంది.