
షిండే అలా మాట్లాడటం దౌర్భాగ్యం: మైసూరారెడ్డి
రాష్ట్ర విభజనకు తాము అనుకూలంగా లేఖ ఇచ్చి, తర్వాత మాట మార్చామంటూ బురద చల్లుతున్నారని, ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెబుతున్న మాటలు పూర్తిగా అసత్యమైనవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి అన్నారు. గుంటూరులో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు.
అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకొని ఒక తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తాము షిండేకు చెప్పామని, కానీ దాన్ని పక్కన పెట్టి, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ఈవిధంగా మాట్లాడటం దౌర్భాగ్యమని మైసూరారెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ తరఫున తాము చెప్పిన విషయాలన్నింటినీ షిండే పూర్తిగా పక్కనపెట్టి, తన నోటికి వచ్చినది చెప్పేస్తున్నారన్నారు.