వైఎస్సార్ సీపీ శ్రేణులపై టీడీపీ వర్గీయుల దాడి
జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్, జెడ్పీటీసీ, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడికి తీవ్ర గాయాలు
ఎమ్మెల్యే గోపిరెడ్డి కారు, పోలీసు జీపు అద్దాలు ధ్వంసం
ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ధర్నా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై టీడీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా నరసరావుపేటలో వైఎస్సార్ సీపీనేతలపై టీడీపీ దాడికి తెగబడింది. ఘటనలో నల్లపాటి రామచంద్రప్రసాద్, జీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ నల్లపాటి శివరామచంద్రశేఖరరావుతో పాటు పార్టీ పట్టణ కన్వీనర్ ఎస్ఏ హనీఫ్, జెడ్పీటీసీ నూరుల్అక్తాబ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు.
నరసరావుపేట : పట్టణంలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డాయి. అధికార బలంతో ప్రతిపక్ష నేతలపై ఇష్టానుసారంగా దాడులు చేస్తూ తిరిగి వారిపైనే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. కొందరు పోలీసు అధికారులు కూడా అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతూ వారి అరాచకాలకు కొమ్ముకాస్తున్నారు.
ఎన్సీవీ కేబుల్ను రాఘవేంద్ర కమ్యూనికేషన్ పేరిట నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తుండగా.. కే-చానల్ను శాసనసభాపతి కుమారుడు డాక్టర్ కోడెల శివరామక ృష్ణ నిర్వహిస్తున్నారు. ఆదివారం వ్యూహాత్మకంగా సుమారు 300 మంది కేబుల్ ఆపరేటర్లు, టీడీపీ కార్యకర్తలు ఎన్సీవీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న నల్లపాటి రాము వర్గీయులు అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ వర్గీయులు కూడా అక్కడకు రావడంతో రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు రాళ్లు, ఇటుకలతో దాడికి పాల్పడ్డారు. దాడిలో నరసరావుపేట జెడ్పీటీసీ షేక్ నూరుల్అక్తాబ్ , పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్ఏ హనీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. హెడ్కానిస్టేబుల్ ఎం.వెంకటేశ్వరరావు కూడా గాయపడ్డారు. ఎమ్మెల్యేకు చెందిన క్వాలీస్ కారు అద్దాలను టీడీపీ వర్గీయులు రాళ్లతో ధ్వంసం చేశారు.
అదే అదనుగా మరోసారి దాడి
పోలీసులు నల్లపాటి రాము, పమిడిపాడు నాయకుడు లాం కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని ఫిరంగిపురం పోలీస్స్టేషన్కు తరలించారు. అధికారుల తీరును నిరసిస్తూ, టీడీపీ దురాక్రమణను ఖండిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తుండగా ఇదే అదనుగా భావించి మరో మారు కేబుల్ కార్యాలయంపై టీడీపీ వర్గీయులు దాడిచేసి ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న ల్యాప్టాప్, కంప్యూటర్, టీవీలు, డిష్లు ధ్వంసం చేయటంతో పాటు హెచ్డీ సెట్ ఆఫ్ బాక్స్లు అపహరించుకెళ్లారు. అడ్డుకోబోయిన జీడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు నల్లపాటి చంద్రంపై గడ్డపారతో దాడికి పాల్పడటంతో ఆయన ఎడమ చేయి విరిగింది. టీడీపీ వర్గీయులు చేసిన దాడిలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎన్సీవీ యాజమాన్యం తెలిపింది.