తెలంగాణలో ఆగని బలిదానాలు
Published Sun, Sep 8 2013 5:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణలో ఆత్మబలిదానాలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్లో నిర్వహించిన సభ తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తుందని ఆందోళన చెంది మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, మరొకరు గుండెపోటుతో మరణించారు. రంగారెడ్డి జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అడవిపదిర గ్రామానికి చెందిన ప్రశాంత్రెడ్డి(18) శనివారం ఏపీఎన్జీవోల సభకు సంబంధించిన దృశ్యాలను టీవీలో చూస్తూ కలత చెంది, మధ్యాహ్నం గ్రామ శివారులోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అలాగే, బోయిన్పల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన కొంకటి పర్శరాములు(45) శనివారం ఏపీఎన్జీవోల సభకు సంబంధించిన దృశ్యాలను టీవీలో చూస్తూ ఉద్వేగానికి లోనై కుర్చీలోనే కుప్పకూలిపోయి మరణించాడు. మెదక్ జిల్లా బాచేపల్లి పంచాయతీ బల్కంచెల్క తండాకు చెందిన మూడ్ సంగ్రాం (23) కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్ వార్తలను టీవీలో చూస్తూ పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగానే తుదిశ్వాస విడిచాడు. మరో ఘటనలో... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడికి చెందిన కట్టె మిషన్ రాజు (25) కూడా సమైక్య సభ విశేషాలను టీవీలో చూస్తూ తీవ్ర మనస్తాపానికి గురై, పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Advertisement
Advertisement