
టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు
సాక్షి, తిరుపతి: టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మంగళవారం మీడియాతో మాడ్లాడుతూ.. రాజకీయ నాయకులు ఆలయాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. దేవాలయాలను రాజకీయాల నుంచి విముక్తి కలిగించాలని పేర్కొన్నారు. దార్మిక సభల ద్వారా ఆలయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. రాజకీయ నాయకులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కూడా వ్యాపార కేంద్రంగా మారుస్తూన్నారన్నారు.
రాజకీయ నాయకులు, అధికారులు తమ స్వార్థం కోసం స్వామి వారి సేవల సమయాన్ని కుదించి, అర్చకులను బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారన్నారు. దీంతో స్వామి వారి సేవలు, ఆరాధన తగ్గిపోయాయని తెలిపారు. ఆగమ శాస్త్రంలో చెప్పినట్లు ఇటువంటి పిచ్చి చేష్టల వలన స్వామివారు ఆగ్రహానికి గురై మహాపరాదం జరుగుతుందన్నారు. పాలకుల పాపాల వలన రాష్ర్టానికి, భక్తులకు అశాంతితోపాటు, స్వామి వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందన్నారు.
కేంద్ర ఎక్స్పర్ట్ కమిటీతో అతి ప్రాచీన ఆలయాలను కాపాడాలని రమణ దీక్షితులు అన్నారు. ఇందులో పురావస్తు, ఆగమ శాస్త్ర పండితులు, ఆభరణాల నిపుణులు, స్వామివారి సేవే పరమావధిగా కలిగిన పరిపాలన సీనియర్ అధికారులు ఉండాలన్నారు. ప్రదానార్చకుడిగా నాకే టీటీడీ ఆభరణాల వివరాలు తెలియటంలేదు.. అన్యమతస్తుల విషయం రాజకీయాల విచక్షణకే వదిలేస్తున్నామన్నారు. ఏ చరిత్ర తెలియని పాలక మండలి, అధికారుల వలన ఆలయ ప్రతిష్ట మంట కలుస్తుందని, దీనిపై సీబీఐ విచారణ జరగాలని, అందులో భక్తుల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment