తిరుమలలో ఘనంగా ఉగాది ఆస్థానం
Published Fri, Apr 8 2016 7:20 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీదుర్ముఖినామ సంవత్సర ఉగాది ఆస్థానం కార్యక్రమం వైభవంగా జరిగింది. వేకువజామున సుప్రభాతం, అభిషేకం కార్యక్రమాల అనంతరం... 7 గంటల నుంచి 9 గంటల వరకు బంగారు వాకిలిలో ఆస్థానం నిర్వహించారు. సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు వేంచేపు చేసి, ప్రత్యేక పూజలందుకున్నారు.
ఆలయ పెద్ద జీయర్, చినజీయర్, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు నూతన పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆస్థాన కైంకర్యాలు నిర్వహించారు. స్వామివారి పాదాల మీద ఉంచిన పంచాంగాన్ని తీసుకుని ఆస్థాన సిద్దాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆలయం మహద్వారం నుంచి గర్భాలయం వరకు లక్ష కట్ పుష్పాలు, 8 టన్నుల సంప్రదాయ పుష్పాలతో చేపట్టిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కొత్త కాంప్లెక్స్ ప్రారంభం
తిరుమలలో శుక్రవారం రూ.300 టికెట్ల భక్తుల కోసం కొత్త కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చింది. భక్తులను శ్రీవారి దర్శనానికి ఈ కాంప్లెక్స్ నుంచి అనుమతించారు. భక్తులకు కొత్త కాంప్లెక్స్లో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
Advertisement
Advertisement