
సమైక్యతే మా ఆశయం : శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ ఆశయం అని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమ న్యాయం కోసం ఎప్పుడూ తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యంగా సమ న్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సిఎం కావచ్చని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని విమర్శించారు. సీమాంధ్రకు సీఎం కావాలని బొత్సతోపాటు మంత్రులూ లాబీయింగ్ చేస్తున్నారని చెప్పారు. అందుకే వారంతా విభజనకు అంగీకరిస్తున్నారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ మరణం సోనియా గాంధీ అనిగానీ, చంద్రబాబు అని గానీ వైఎస్ఆర్సీపీ ఏ నాడు ఆరోపించలేదన్నారు. ఆయన మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూనే ఉన్నామన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ వల్లే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు విప్ జారీ చేశారని చెప్పారు. ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధంగా చేయడం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా ప్రత్యేక రాష్ట్రం విషయం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నట్లు తెలిపారు. సీమాంధ్ర ఎలా తగలబడిపోతుందో చూడటానికే బాబు యాత్ర చేస్తున్నారన్నారు. రోమ్ చక్రవర్తిని మించిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఆయన రాజకీయ కుట్రలే కారణం అన్నారు.
సమైక్యాంధ్ర కోసం తమ రాజీనామాలను ఆమోదింపజేసుకుంటామని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చెప్పారు. శాసనసభ్యత్వాలకు తాము చేసిన రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు. టిడిపి వారు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నది ఒక్క వైఎస్ఆర్ సిపియే నని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటు క్రెడిట్ తనదే అని చంద్రబాబు అన్నట్లు చెప్పారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి ఆయన 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారని గుర్తు చేశారు. చంద్రబాబు సమైక్యరాష్ట్రం కోసం ఏనాడూ మాట్లాడలేదని చెప్పారు.