
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన 18వ రోజు ప్రజాసంకల్పయాత్రను వెంకటగిరిలో ముగించారు. ఇవాళ ఆయన 13.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరిలో వైఎస్ జగన్ ఈ రోజు రాత్రి బస చేయనున్నారు. ఆదివారం ఉదయం వైఎస్ జగన్ రామకృష్ణాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి ఎర్రగుడి, గోరంట్ల మీదగా వెంకటగిరి వరకూ కొనసాగింది. అంతకు ముందు వైఎస్ జగన్ను.. సి.బెళగలకు చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు కలిశారు.
గ్రామంలో ఫ్యాక్షన్ హత్యలపై వారు వివరించారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై తన భర్త నల్లన్నను గత ఏడాది హత్య చేశారని దస్తగిరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వైఎస్ఆర్ సీపీలో ఉన్నామనే తమపై హత్యా రాజకీయాలు చేస్తున్నారని, నిందితులు ఇప్పటికీ బయటే తిరుగుతున్నారని వాపోయింది. కార్యకర్తలకు అండగా ఉంటానని, అధైర్యపడవద్దని వైఎస్ జగన్ ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పారు. అలాగే గోరంట్లలో బీసీ సంఘాల ప్రతినిధులు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.