
సాక్షి, అమరావతి: ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందం రాష్ట్రంలో మహిళా పాడి రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని, అలాగే.. వారి సాధికారతకూ తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అమూల్తో మంగళవారం జరగనున్న అవగాహన ఒప్పందం నేపథ్యంలో సోమవారం క్యాంపు కార్యాలయంలో ఒప్పందంలోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఇది రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుందని అధికారులు పేర్కొన్నారు. సీఎం ఏమన్నారంటే..
► ఈ ఒప్పందంవల్ల పాడి రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా వినియోగదారులకు కూడా సరసమైన ధరలకి, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి.
► ప్రపంచపు అత్యుత్తమ టెక్నాలజీ, విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
► రాష్ట్రంలో పాడి పరిశ్రమ రంగాన్ని గొప్పగా తీర్చిదిద్దుతుంది.
► వైఎస్సార్ చేయూత, ఆసరా పథకం కింద మహిళలకు ఏడాదికి రూ.11వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం. వీరు మరింత స్వయం సమృద్ధి సాధించే దిశగా పాడి పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని ప్రొత్సహించాలి. ఆ పరిశ్రమల్లో మహిళలకున్న అవకాశాలను పరిశీలించి వారిని ముందుకు నడిపించాలి.
డెయిరీ కార్యకలాపాల్లో కీలక అడుగు ముందుకు పడనుంది.
సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ వాణీమోహన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.