రాజధాని.. అవినీతి పుట్ట | Ysrcp leaders fires on TDP on new assembly issue | Sakshi
Sakshi News home page

రాజధాని.. అవినీతి పుట్ట

Published Thu, Jun 8 2017 2:12 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

రాజధాని.. అవినీతి పుట్ట - Sakshi

రాజధాని.. అవినీతి పుట్ట

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మండిపాటు 
 
సాక్షి, అమరావతి: వెలగపూడిలోని నూతన శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాంబర్‌లో వర్షపు నీటి లీకేజీపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వారితోపాటు మీడియా ప్రతిని ధులు అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు నిబంధనలు ఒప్పుకోవన్నారు. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం కొద్దిసేపు కురిసిన వర్షానికి జగన్‌ చాంబర్‌లో సీలింగ్‌ ఊడిపడిన విషయం తెలిసిందే. రూఫ్‌ నుంచి ధారాళంగా వర్షపునీరు కారడంతో బకెట్లతో తోడిపోశారు.

ఈ ఘటనలో వాస్తవాలు తెలుసుకునేందుకు బుధవారం ఉదయం  ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ముస్తఫా, కొక్కిలిగడ్డ రక్షణనిధి వెలగపూడి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న మీడియా ప్రతినిధులతో కలిసి లోపలికి వెళుతుండగా అసెంబ్లీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మీడియాను అనుమతించలేదు. ఎందుకని ఎమ్మెల్యేలు ప్రశ్నించగా అసెంబ్లీ నిబంధనలు ఒప్పుకోవని సమాధానమిచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు ఎదుటే బైఠాయించి నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళనకు దిగారు. వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించడం, ఎమ్మెల్యేలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

 ఎమ్మెల్యే కోన రఘుపతి అసెంబ్లీ కార్యదర్శికి ఫోన్‌ చేసి తమను లోనికి ఎందుకు పంపరని ప్రశ్నించారు. స్పీకర్‌ అనుమతి లేకుండా మీడియాతో సహా ఎమ్మెల్యేలను లోనికి పంపలేమని కార్యదర్శి బదులిచ్చారు. అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి విజయరాజు బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. జగన్‌మోహన్‌రెడ్డి గదికి ఉన్న కిటికీలు తెరిచి ఉండడం వల్లే వర్షపు నీరు లోపలికి వచ్చిందన్నారు. అసలు జగన్‌ గదికి కిటికీలే లేవని, అలాంటప్పుడు వర్షపు నీరు ఎలా వస్తుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను లోనికి పంపకూడదనే నిబంధన ఎక్కడుందో చూపాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి అధికారులు కూడా గుక్కతిప్పుకోకుండా అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. మీడియాను అనుమతించకపోతే తామూ లోనికి వెళ్లబోమంటూ ఎమ్మెల్యేలు నిరసనగా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 
 
సీబీఐ విచారణకు ఆదేశించాలి: ఆర్కే
గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):
ప్రభుత్వమే జగన్‌ చాంబర్‌కు వెళ్లే ఏసీ పైపును కట్‌ చేయించి తమపై నింద వేస్తోందని మంగళగిరి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. ఆయన విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఒక వ్యూహం ప్రకారం మంగళవారం రాత్రే పైపు కట్‌ చేయించి, ఆ ఫొటోలు ముందే తీయించిందని, కానీ వాటిని బుధవారం బయటపెట్టిందని తెలిపారు.రిపేర్ల కోసం తామే విద్యుత్తు పైపు కిందకు దించామని సీఆర్‌డీఏ కమిషనర్‌  శ్రీధర్‌ చెప్పారని, దాని నుంచి నీరు కారిందని ఇంజనీరును వెంటపెట్టుకుని వెళ్లి మరీ మీడియాకు తెలిపారని, వర్షపు నీరు లీకై కుండపోతగా ధారపడిన విషయమే కాకుండా, నిర్మాణ దశనుంచి జరిగిన కుట్రలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆర్కే కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement