
రోజాపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు.
ఒంగోలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పడం, చంద్రబాబు దిగజారుడు మోసానికి నిదర్శనమన్నారు. 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి... ఆ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు రూ.2800 కోట్లు అవసరం ఉంటే... బడ్జెట్లో మాత్రం రూ.200 కోట్లే కేటాయించారన్నారు.
బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదాను సమాధి చేశారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాపై చంద్రబాబుకు ఎందుకంత వ్యక్తగత కక్ష అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రోజాను ఇప్పటికే ఏడాదిపాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెర లేపుతోందని ఆయన అన్నారు. రోజా సస్పెన్షన్పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
కాగా ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు ఏపీ శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు సమర్పించారు. కాల్మనీ సెక్స్ రాకెట్పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినపుడు.. ఆమె ప్రవర్తనను తప్పు పడుతూ 2015, డిసెంబర్ 18న శాసనసభ నుంచి ప్రివిలేజ్ కమిటీకి పంపకుండానే నేరుగా సస్పెండ్ చేశారు.