భారత్మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్కు (ఐపీఓ)కు రానున్నది...
- రూ.600-700 కోట్లు సమీకరణ ప్రణాళిక
- సెబీకి పత్రాలు...
న్యూఢిల్లీ: భారత్మ్యాట్రిమోని బ్రాండ్ కింద ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలు కుదిర్చే మ్యాట్రిమోనిడాట్కామ్ త్వరలో పబ్లిక్ ఆఫర్కు (ఐపీఓ)కు రానున్నది. ఐపీఓకు సంబంధించిన పత్రాలను ఈ సంస్థ బుధవారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ సంస్థ రూ.600-700 కోట్ల నిధులు సమీకరించనున్నదని సమాచారం. . ఈ ఐపీఓలో భాగంగా రూ.350 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ కింద 16.6 లక్షల షేర్లను జారీ చేయనున్నదని ఈ పత్రాల్లో మ్యాట్రిమోనిడాట్కామ్ పేర్కొంది.
ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటి గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, డాయిస్ ఈక్విటీస్ ఇండియాలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. గత ఆర్థిక సంవత్సరం (2014-15) చివరి నాటికల్లా మ్యాట్రిమోనీడాట్కామ్ సంస్థ రూ.243 కోట్ల ఆదాయాన్ని రూ.18 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది. ఈ సంస్థ వద్ద 26.5 లక్షల వధూవరుల ప్రొఫైల్స్ ఉన్నాయి. నిధుల సమీకరణ విస్తరణ కార్యకలాపాలకు వినియోగించాలన్నది ప్రణాళిక. ఇంత భారీ స్థాయి లో ఐపీఓకు వస్తోన్న 2వ ఇంటర్నెట్ కంపెనీ ఇది. ఇంతకు ముందు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్ 2013లో రూ.950 కోట్లు ఐపీఓ ద్వారా సమీకరించింది.