
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణాలపైనా కోవిడ్–19 భారం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 ఏప్రిల్) మధ్య తన స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్రం శుక్రవారం గణనీయంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. నిజానికి తొలి అంచనా రూ.7.8 లక్షల కోట్లు. అంటే రుణ సమీకరణ అంచనా 4.2 లక్షల కోట్లు పెరిగిందన్నమాట. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో తగ్గుతుందని భావిస్తున్న తన ఆదాయాన్ని పూడ్చుకునే క్రమంలో రుణ సమీకరణ అంచనాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
వారం వారీ రుణ సమీకరణ లక్ష్యాన్ని కూడా రూ.21,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు కేంద్రం పెం చింది. తన ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మార్కెట్ రుణాలను ఒక సాధనంగా ఎంచుకునే సంగతి తెలిసిందే. 2019–20లో మార్కెట్ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యాన్ని (ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 3.5%)కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment