
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డిజిల్ ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. పెట్రోల్ ధర ఆదివారం నాలుగేళ్ల గరిష్ట స్ధాయిలో దేశరాజధానిలో లీటర్కు రూ 73.73కు చేరగా, డీజిల్ అత్యంత గరిష్టస్ధాయిలో లీటర్కు రూ 64.58కి ఎగబాకింది. పెట్రో ఉత్పత్తుల ధరలు మండిపోతుండటంతో వీటిపై ఎక్సైజ్ పన్నులను భారీగా తగ్గించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంధన ధరలను రోజువారీ సవరిస్తున్న చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను ఆదివారం లీటర్కు 18 పైసల చొప్పున పెంచడంతో ఇవి అత్యంత గరిష్టస్ధాయిలకు చేరి సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి.
అంతర్జాతీయ ముడిచమురు ధరల పెంపును అధిగమించేందుకు పెట్రోల్, డీజిల్పై ఎక్సయిజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతున్నా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. పెట్రోల్, డీజిల్లపై అత్యధిక పన్నుల కారణంగా దక్షిణాసియా దేశాల్లో భారత్లోనే పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరలు ప్రజలకు భారంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment