
మేడిన్ ఇండియా సాఫ్ట్వేర్పై కేంద్రం దృష్టి
భారత్ను సాఫ్ట్వేర్ తయారీ కేంద్రంగా మలచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఐటీ సేవల పరిశ్రమ పదివేల కోట్ల డాలర్లకు మించిపోయింది.
నేడు బెంగళూరులో ఐటీ పంచాయత్
న్యూఢిల్లీ: భారత్ను సాఫ్ట్వేర్ తయారీ కేంద్రంగా మలచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఐటీ సేవల పరిశ్రమ పదివేల కోట్ల డాలర్లకు మించిపోయింది. పలు ఐటీ కంపెనీలు మేడిన్ ఇండియా సాఫ్ట్వేర్ తయారీపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) బెంగళూరులో ఐటీ పంచాయత్ జరుగుతోంది. నాస్కామ్ ఇతర కొన్ని కీలకమైన సంఘాల భాగస్వామ్యంతో జరుగుతోన్న ఈ ఐటీ పంచాయత్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొననున్నారు.
ఈ సమావేశంలోనే ఆయన మేడిన్ ఇండియా సాఫ్ట్వేర్ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారని ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. వచ్చే వారంలో బడ్జెట్ రానున్న సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన అవకాశాలు, అడ్డంకులు తదితర అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐటీ వినియోగం అంశంపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు.
కాగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(ఐటీ-బీపీఎం) పరిశ్రమ 10,900 డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు ఐటీ ఉత్పత్తుల ఆదాయం 220 కోట్ల డాలర్లుగానే ఉంది. ఈ ఆదాయాన్ని 2020 కల్లా 1,000 డాలర్లకు పెంచాలని నాస్కామ్ లక్ష్యంగా నిర్దేశించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్లను మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇలాంటి సాఫ్ట్వేర్లను దేశీయంగా తయారు చేయాలనేది ప్రభుత్వం సంకల్పం.