
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి రూ. 61.96 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వచ్చాయి. కేంద్రం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన 60 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది సుమారు 3 శాతం అధికం. ఈక్విటీల్లోకి వచ్చిన నిధులు, రీ ఇన్వెస్ట్ చేసిన ఆదాయాలు, ఇతరత్రా పెట్టుబడులు అన్నీ ఇందులో ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సరళీకృత విధానాలు మొదలైనవి ఇందుకు దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది. అంతక్రితం నాలుగేళ్లలో వచ్చిన 152 బిలియన్ డాలర్లతో పోలిస్తే గడిచిన నాలుగేళ్లలో విదేశీ పెట్టుబడులు 222.75 బిలియన్ డాలర్లకు పెరిగాయని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు.
ప్రభుత్వం గత నాలుగేళ్లలో డిఫెన్స్, వైద్య పరికరాలు, నిర్మాణ రంగం, రిటైల్, పౌర విమానయానం తదితర రంగాలల్లో ఎఫ్డీఐ నిబంధనలను సడలించింది. మరోవైపు, యూఎన్సీటీఏడీ నివేదికలోని అంశాలు మాత్రం డీఐపీపీ లెక్కలకు విరుద్ధంగా ఉన్నాయి. 2016లో భారత్లోకి వచ్చిన 44 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలతో పోలిస్తే 2017లో ఇవి 40 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు ఈ నివేదిక పేర్కొంది. యూఎన్సీటీఏడీ నివేదిక వచ్చిన మర్నాడే ప్రభుత్వం ఈ గణాంకాలు వెలువరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment