![Malaysia Airport Cancels Agreement With GMR Group - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/4/gmr.jpg.webp?itok=RFF4SgxD)
హైదరాబాద్: జీఎంఆర్ గ్రూప్నకు మలేసియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ బెర్హడ్ (ఎంఏహెచ్బీ) షాక్ ఇచ్చింది. జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు చెందిన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్తో కుదిరిన షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ను రద్దు చేస్తున్నట్టు తేల్చిచెప్పింది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తమకున్న 11 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు విక్రయించేందుకు ఎంఏహెచ్బీ గతేడాది ఫిబ్రవరిలో అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ విలువ సుమారు రూ.530 కోట్లు. అయితే నిబంధనల ప్రకారం 2018 డిసెంబర్ 31లోగా ఒప్పందాన్ని సక్రమంగా అమలుపరచని కారణంగా డీల్ను రద్దు చేసుకుంటున్నట్టు ఎంఏహెచ్బీ ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో జీహెచ్ఐఏఎల్లో ఎంఏహెచ్బీ, ఎంఏహెచ్బీ (మారిషస్) వాటాదారుగా ఉంటాయని వెల్లడించింది. శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో (జీహెచ్ఐఏఎల్) జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు 63%, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 13%, తెలంగాణ ప్రభుత్వానికి 13% వాటా ఉంది. గురువారం బీఎస్ఈలో జీఎంఆర్ ఇన్ఫ్రా షేరు ధర 1.88 శాతం తగ్గి రూ.15.65 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment