
కోవిడ్-19 సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనట్లు ఆర్బీఐ తాజాగా పేర్కొంది. దీంతో ఆర్థిక పురోగతికి వీలుగా రెపో రేటును 0.4 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా మార్చి 1 నుంచి అమలు చేస్తున్న రుణ వాయిదా చెల్లింపులపై నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు తెలియజేసింది. ఫలితంగా కాలావధిగల రుణ చెల్లింపుల వాయిదాలపై ఆగస్ట్ 31వరకూ మారటోరియం కొనసాగనుంది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతానికి దిగివచ్చిన వెంటనే మార్కెట్లు జోరందుకోగా.. రుణ చెల్లింపులపై మారటోరియం కారణంగా బ్యాంకింగ్ కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. రుణ చెల్లింపులపై ఆరు నెలల మారటోరియంతో బ్యాంకులకు సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది సెంటిమెంటును దెబ్బతీసినట్లు తెలియజేశారు. వెరసి సెన్సెక్స్ ఆటుపోట్ల మధ్య 260 పాయింట్లు కోల్పోయి 30,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 67 పాయింట్లు తక్కువగా 9,039 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 31,108 పాయింట్ల వద్ద గరిష్టాన్నీ, 30,475 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఈ బాటలో నిఫ్టీ 9150- 8969 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.
ప్రయివేట్ బ్యాంక్స్ డౌన్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్, రియల్టీ 2.4-1.2 శాతం మధ్య వెనకడుగు వేశాయి. అయితే మీడియా, ఐటీ, ఫార్మా 2-0.7 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, ఐసీఐసీఐ, టాటా స్టీల్, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్ఢీఎఫ్సీ బ్యాంక్ 5.2-2 శాతం మధ్య డీలాపడ్డాయి. ఇతర బ్లూచిప్స్లో జీ, ఎంఅండ్ఎం, సిప్లా, శ్రీ సిమెంట్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, ఐవోసీ 7.2-1.6 శాతం మధ్య ఎగశాయి.
ఫైనాన్స్ వీక్
డెరివేటివ్ కౌంటర్లలో ఎంఅండ్ఎం ఫైనాన్స్, ఈక్విటాస్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, పీఎఫ్సీ, ఐబీ హౌసింగ్, అశోక్ లేలాండ్ 6-5 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు టాటా కెమికల్స్, నిట్ టెక్, సెంచురీ టెక్స్, ఏసీసీ, టాటా పవర్, జూబిలెంట్ ఫుడ్ 4.5-3.2 శాతం మధ్య జంప్ చేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.25 శాతం చొప్పున బలహీనపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1317 నష్టపోగా.. 969 లాభపడ్డాయి.
ఎఫ్పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ (డీఐఐలు) రూ. 402 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బుధవారం ఎఫ్పీఐలు దాదాపు రూ. 1467 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 2373 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.