
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 54వేల పెట్రోల్ బంకులు మూతపడబోతున్నాయి. మెరుగైన మార్జిన్లు, జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తుల తీసుకురావడం, డీలర్ల కమీషన్ పెంపు వంటి పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 13న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నట్టు యునిటెడ్ పెట్రోలియం ఫ్రంట్(యూపీఎఫ్) ప్రకటించింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తమ డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే అక్టోబర్ 27 నుంచి పెట్రోలియం ఉత్పత్తులు కొనడం, అమ్మడం ఆపివేసి, నిరవధిక బంద్కు కూడా దిగుతామని హెచ్చరించింది.
ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న తమ ప్రతిపాదనలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్లు, డీలర్ల అసోసియేషన్, కన్సోర్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్లు తెలిపాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీలర్ల మార్జిన్లను సమీక్షించడం, పెట్టుబడులపై మెరుగైన రిటర్నులు పొందడం, మానవ శక్తి సమస్యలను పరిష్కరించడం వంటి డిమాండ్లను పెట్రోలియం డీలర్లు ఎప్పడినుంచో అభ్యర్థిస్తున్నారు. రోజు వారీ రేట్ల మార్పుతో డీలర్ల నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పిన పెట్రోలియం శాఖ ఇప్పటికీ విధివిధానాలను రూపొందించలేదని అసోసియేషన్లు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment