
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. బ్యాంకుకు చెందిన ముంబై బ్రాంచులో భారీగా మోసపూరిత లావాదేవీలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొంది. కొంతమంది అకౌంట్ హోల్డర్స్ ప్రయోజనార్థం ముంబైలోని తమ ఒక బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది.
ఈ నగదును ముంబై బ్రాంచు నుంచి విదేశాలకు పంపినట్టు తెలిసింది. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని వినియోగదారుల బ్యాంకు అకౌంట్లకు నగదును పంపినట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని ఇప్పటికే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు విచారించడం ప్రారంభించాయని పీఎన్బీ తెలిపింది. పారదర్శకతమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకే బ్యాంకు కట్టుబడి ఉందని పీఎన్బీ చెప్పింది. ఈ వార్తల నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు భారీగా పడిపోయింది. దాదాపు 6 శాతం ఈ బ్యాంకు షేరు క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment