అచ్చం సినిమాలా ఓ బిజినెస్ టైకూన్ స్టోరీ
ముంబై: మోస్ట్ పాపులర్ క్లోతింగ్బ్రాండ్ రేమండ్స్ మాజీ ఛైర్మన్, బిజినెస్ టైకూన్ విజయ్పత్ సింఘానియా (78) చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. ముంబాయికి చెందిన మాజీ షెరీఫ్ డిసెంబరు 19, 2005 నుండి 18 డిసెంబరు 2006 వరకు రేమండ్ గ్రూప్కు చైర్మన్గా ఒక వెలుగు వెలిగారు. అలా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అవోకగా నిర్వహించిన బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా కటకటలాడుతున్నారంటే నమ్మగలమా? కానీ తాజా వార్తల ప్రకారం ఇది నమ్మలేని నిజం. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తూ...ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన విజయ్పత్ సింఘానియా ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది.
వివరాల్లోకి వెళితే తన సొంత కుమారుడి పైనే బాంబే హైకోర్టులో కేసు వేశారు సింఘానియా కంపెనీలోని షేర్లను తన కుమారుడుకి అప్పజెప్పి, ఇపుడు తాము మోసపోయామని, తన డూప్లెక్స్ హౌస్ తదితర ఆస్తులను తనకు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తన బాధాకరమైన ఆర్థిక పరిస్థితి గురించి కోర్టుకు వివరిస్తూ, మూడు రోజుల క్రితం సీనియర్ సింఘానియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. రూ. 1000 కోట్ల విలువ కలిగిన కంపెనీని, షేర్లను కొడుకు గౌతమ్ సింఘానియా అప్పగించానని చెప్పారు. అలాగే మలబార్ హిల్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన 36 అంతస్తుల జేకే హౌస్లో డూప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ముంబైలోని నెపియన్ సీ రోడ్లో ఓ ఇంటిలోకి నెలకు రూ. 7 లక్షలకు అద్దెకు ఉంటున్నామనీ, ఇప్పటివరకూ చెల్లించిన అద్దెను కూడా రీఎంబర్స్ చేయాలని ఆయన కోరుతున్నారు.
మరోవైపు తన కుమారుడి కోసం మొత్తం ఆస్తిని అంతా సింఘానియా త్యాగం చేస్తే.. ఇప్పుడా కొడుకు ఆయనను ఏమీ లేని స్థితికి చేరుస్తున్నాడని న్యాయవాదులు అంటున్నారు. ఈయన డాక్యుమెంట్స్, పర్సనల్ ఫైల్స్ను నిర్వహించిన ఇద్దరు రేమండ్ ఉద్యోగులు కూడా మిస్ కావడంతో, ఆయా పత్రాలను పొందేందుకు వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. కొడుకు గౌతమ్ వేధింపులు ఎక్కువయ్యాయని లాయర్లు చెబుతున్నారు.
రీసెంట్గా గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న సింఘానియా కరియర్లో అనేక సాహసోపేత అవార్డులు, రివార్డులు కూడా ఉన్నాయి. నిర్విరామంగా 5,000 గంటలపాటు విమాన నడిపిన అనుభవం ఉంది. 1994 లో ఫెడేరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ 24 రోజులు పాటు 34,000 కి.మీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. భారత వైమానిక దళం నుంచి ఎయిర్ కమోడర్ పురస్కారం, 1998 లో యూకే నుండి భారతదేశం వరకు సోలో మైక్రోలైట్ విమానాన్ని నడిపి వరల్డ్ రికార్డ్, 2005 లో రాయల్ ఏరో క్లబ్ నుంచి బంగారు పతకం, 2006 లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ సత్కారాన్ని అందుకున్నారు. 'యాన్ ఏంజిల్ ఇన్ ది కాక్పిట్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. మార్చి 2007 లో ఐఐఎం అహ్మదాబాద్ కు పాలక మండలి ఛైర్మన్గా ఎంపికయ్యారు.
కాగా ఆయన పెద్దకుమారుడు 1988లో మధుపతి సింఘానియా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. ముంబైలోని పూర్వీకుల ఇంటిని, ఇతర ఆస్తులను వదులుకుని భార్యా, నలుగురు పిల్లలతో సహా సింగపూర్కి వెళ్లిపోయారు. అనంతరం గౌతం హరి సింఘానియా రేమాండ్స్ ఎండీగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై సీనియర్ సింఘానియా కుమారుడు గౌతం ఇంకా స్పందించలేదు.