
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ మరో విడత రెపో రేటు తగ్గిస్తామనే సంకేతాలిచ్చారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.15 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలో మందగమన ధోరణిని ఆర్బీఐ 2019 ఫిబ్రవరిలోనే గుర్తించిందని, దీన్ని నివారించే లక్ష్యంతోనే అప్పటి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశాల్లో రెపో రేటును తగ్గిస్తూ వచ్చామని చెప్పారాయన. ఈ కాలంలో 135 బేసిస్ పాయింట్ల రెపో (1.35%) తగ్గించడాన్ని ప్రస్తావించారు.
ఈ నెల్లో పెంచకపోవటాన్ని ప్రస్తావిస్తూ... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, వేచిచూసే ధోరణికి మారామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై టైమ్స్ నెట్వర్క్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ‘బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్లను సరిచేసుకునే ప్రక్రియలో ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారానికి సంబంధించిన దిశలో ఇది ఒక కీలక అడుగు. తదుపరి ఆర్థిక వృద్ధికి ఊతం ఇచ్చే అంశం’ అని పేర్కొన్నారు.