నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Published Wed, May 24 2017 4:19 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
భారత్, పాక్ సరిహద్దులో మరోసారి ఆందోళనకర వాతావరణం, మిడ్ క్యాప్ కరెక్షన్ తో స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 63.61 పాయింట్ల నష్టంలో 30,301.64 వద్ద, నిఫ్టీ 25.60 పాయింట్ల నష్టంలో 9,360 వద్ద క్లోజయ్యాయి. నేటి ట్రేడింగ్ లో టాటా మోటార్స్ టాప్ గెయినర్ గా లాభాలు పండించడంతో 'స్టాక్ ఆఫ్ ది డే'గా నిలిచింది. అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించడంతో టాటా మోటార్స్ స్టాక్ 4.44 శాతం మేర దూసుకెళ్లింది. టాటా మోటార్స్ తో పాటు టాటా మోటార్స్ డీవీర్, గెయిల్ షేర్లు రెండు సూచీల్లో లాభాలు పండించాయి. బీహెచ్ఈఎల్, లార్సెన్ అండ్ టర్బో, బ్యాంకు ఆఫ్ బరోడా, భారతీ ఇన్ ఫ్రాటెల్ లు నష్టాలు గడించాయి.
నేటి సెషన్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, మెటల్, ఫార్మా, రియల్ ఎస్టేట్ స్టాక్ లే ఎక్కువగా నష్టపోయినట్టు తెలిసింది. పాకిస్తాన్ తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి మరోసారి క్రాస్ బోర్డర్ టెన్షన్ నెలకొనడంతో ఎస్ అండ్ పీ బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రెండు సూచీలు 1 శాతం పైగా పడిపోయాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు గత ఆరు నెలలుగా లాభాల దిశగా పయనిస్తున్నాయని, ఈ గరిష్ట స్థాయిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందనీ విశ్లేషకులు చెప్పారు. అదేవిధంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.83గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 96 రూపాయల నష్టంతో 28,751గా నమోదయ్యాయి.
Advertisement
Advertisement