
ముంబై : గ్లోబల్గా సంకేతాలు బలహీనంగా ఉండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ సంకేతాలతో పాటు అత్యధిక బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి క్షీణించడం మార్కెట్లను పడగొట్టింది. 100 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, ప్రస్తుతం 124 పాయింట్ల నష్టంలో 35,339 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 39 పాయింట్ల నష్టంలో 10,729 వద్ద కొనసాగుతోంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరుగుతుండటంతో, దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ 2 శాతం వరకు నీరసించాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా మోటార్స్, టెక్ మహింద్రా టాప్ గెయినర్లుగా ఉండగా.. పవర్ గ్రిడ్, ఏసియన్ పేయింట్స్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఎక్కువగా నష్టపోయాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 2014 నవంబర్ నుంచి తొలిసారి 8 శాతం మార్కుకు పైకి ఎగిశాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ ట్రేడింగ్ ప్రారంభంలో 34 పైసలు పడిపోయి 67.46 గా నమోదైంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభం కావడంతో రూపాయి బలహీనపడిందని మోతీలాల్ ఓస్వాల్ అన్నారు. మరోవైపు ఆసియన్ షేర్లు కూడా రెండున్నర నెలల గరిష్టం నుంచి వెనక్కి తగ్గాయి. యూరోప్ భారీ ద్రవ్య ఉద్దీపనం ముగింపుకు చేరుకుంటుండటంతో, ఆసియన్ మార్కెట్లు నష్టపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment