
ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చాయి.
ఇతరత్రా కార్పొరేట్ల కుటుంబ కార్యాలయాలకు సంబంధించి సిటాక్స్ హోల్డింగ్స్ ఫ్యామిలీ ఆఫీస్ 500 మిలియన్ డాలర్లు, జీఎంఆర్ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 50 మిలియన్ డాలర్లు, ఆదిత్య బిర్లా ఫ్యామిలీ ఆఫీస్ 25 మిలియన్ డాలర్లు, ప్రముఖ ఇన్వెస్టరు రాకేష్ ఝున్ఝున్వాలా సతీమణి రేఖా ఝున్ఝున్వాలా 25 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశారు. 2 వారాలు లేదా 26 వారాల స్టాక్ సగటు ధర (ఏది ఎక్కువైతే అది) ప్రాతిపదికన షేర్ల కేటాయింపు ఉండనుంది. దీనిపై డిసెంబర్ 10న యస్ బ్యాంక్ బోర్డు మరోసారి భేటీ కానుంది. శుక్రవారం బీఎస్ఈలో యస్ బ్యాంక్ షేరు.. 2.5% క్షీణించి రూ. 68.30 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment