
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్లోని తన సోదరి నివాసానికి వచ్చారు. అనంతరం అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో అజయ్ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
(చదవండి : ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది)
రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. సుదీర్ఘంగా విచారించి భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో పట్టుబడ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్పేట ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ రవీంద్ర నాయక్ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో సుజాత విచారణ ఎదుర్కోంటుంన్నారు.
Comments
Please login to add a commentAdd a comment