
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు (గురువారం) కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ జైలుకు తరలించారు.14 రోజులు ఆయన తీహార్ జైల్లో గడపాల్సి వుంది.
అయితే జైలులో తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీకోర్టును ఆశ్రయించారు చిదంబరం. జెడ్-కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అదే తరహా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే.. చిదంబరం నేలమీద కూర్చోలేరు కనుక వెస్ట్రన్ టాయిలెట్ ఉండాలని కూడా అభ్యర్థించారు. దీంతో జైలు మాన్యువల్కు లోబడి చిదంబరం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అన్ని అభ్యర్థనలను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ అనుమతించారు. జైలులో చిదంబరానికి తగిన భద్రత ఉంటుందని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) హామీ ఇచ్చారు. అలాగే మందులను జైలుకు తీసుకెళ్లడానికి అనుమతి లభించింది. కాగాఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదరంబరం తన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో మాజీ మంత్రిని ఆగస్టు 21 రాత్రి సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment