
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గడ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలోని జేగురు కాండు అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మరోసారి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో పలువురు మావోలు చనిపోగా, ఆ కాల్పుల్లో తప్పించుకున్న వారికోసం నిన్నటి నుంచి దండకారుణ్యంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం సుక్మాలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు.. మావోయిస్టులు ఎదురుపడటంతో మరోసారి కాల్పులు మోత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్కౌంటర్లు బూటకం
మరోవైపు మహారాష్ట్ర - ఛత్తీస్గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లు బూటకమని మావోయిస్టు పార్టీ నేత జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోరుబిడ్డలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్న పాలకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. త్వరలో పోలీసులకు తగిన గుణపాఠం చెబుతామని జగన్ పేర్కొన్నారు.