22 గంటలు దుర్గమ్మ దర్శనం
– అంతరాలయ దర్శనం రద్దు
– వీఐపీలకు ప్రత్యేక సమయంలోనే ముఖమండప దర్శనం
– భక్తులకే ప్రథమ ప్రాధాన్యం
– పర్మినెంట్గా టోల్ ఫ్రీ నంబర్
– ఈవో సూర్యకుమారి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
పుష్కర యాత్రికుల కోసం దుర్గగుడిని రోజుకు 22 గంటలు తెరిచి ఉంచుతామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. పుష్కరాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్ల గురించి బ్రాహ్మణవీధిలోని దుర్గగుడి పరిపాలన భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ వైవీ అనూరాధ, దుర్గగుడి ఈవో సూర్యకుమారి వివరించారు. పుష్కరాలు జరిగే సమయంలో అమ్మవారి దర్శనానికి రోజూ రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశామని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మరుసటిరోజు రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను ఐదు క్యూలైన్లలో అనుమతిస్తామని చెప్పారు. రద్దీలో 90 శాతం ఉచిత దర్శనం ద్వారానే అమ్మవారిని దర్శించుకుంటారని భావిస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నంబర్ ఇక శాశ్వత ప్రాతిపదకన ఉంటుందని చెప్పారు. అంతరాయల దర్శనం రద్దు చేస్తున్నామని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు శఠగోపం(పాదుకలు) పెట్టేది, పండితుల ఆశీర్వాదాలు, ప్రసాదాలు అందజేయడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా ముఖమండప దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. రూ.500 టికెట్ కొనుగోలు చేసిన వారికి శీఘ్రదర్శనం కల్పిస్తామన్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే వీఐపీలను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు ప్రత్యేకంగా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. వీఐపీలకు పున్నమి ఘాట్తోపాటు ఘాట్రోడ్డు నుంచి ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేస్తున్నామని, వాటిలోనే కొండపైకి చేరుకోవాల్సి ఉంటుందన్నారు.
వినాయకుడి గుడి నుంచే క్యూలైన్..
వినాయకుడి గుడి నుంచి ఇంద్రకీలాద్రి పైకి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కుమ్మరిపాలెం వైపు నుంచి మరో క్యూలైన్ ఏర్పాటుచేసి టోల్గేట్ వద్ద కలుపుతారు. దర్శనానంతరం మహామండపం, మల్లేశ్వరాలయం మీదుగా కొండ కిందకు దిగేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మూడు ప్రాంతాల్లో ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని, భక్తుల రద్దీని బట్టీ రేషన్ విధిస్తామన్నారు. పుష్కరాల్లో రోజుకు 25వేల మందికి అమ్మవారి అన్నప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. భక్తులు బఫే తరహాలో అన్నప్రసాదం స్వీకరించాల్సి ఉంటుందన్నారు. తలనీలాలు సమర్పించుకునేందుకు ప్రస్తుతం ఉన్న అరండల్ సత్రాన్ని మూసివేసి, పున్నమి, భవానీ, దుర్గాఘాట్లో కేశఖండనశాలలను ఏర్పాటు చేశామని చెప్పారు. దుర్గగుడిపై విధుల నిర్వహణ కోసం రాష్ట్రంలోని ఇతర దేవాలయాల నుంచి 600మంది సిబ్బంది వచ్చారని, మరో వెయ్యిమంది ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను నియమించామని వివరించారు.
బస్టాండ్, రైల్వేస్టేషన్లలో అమ్మవారి దర్శనం
పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లో కూడా అమ్మవారి మూర్తులను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అక్కడ అమ్మవారికి ఏక హారతి ఇవ్వడంతో పాటు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.