వేర్వేరుచోట్ల నలుగురి ఆత్మహత్య | 4 persons suicide in various palces | Sakshi
Sakshi News home page

వేర్వేరుచోట్ల నలుగురి ఆత్మహత్య

Published Wed, Sep 28 2016 12:09 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

4 persons suicide in various palces

వెంకటాపురం : కడుపునొప్పి భరించలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని నర్సాపూర్‌ గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది, వెంకటాపురం ఎస్సై పోగుల శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. నర్సాపూర్‌కు చెందిన తడక నాగరాజు-లావణ్య దంపతుల పెద్ద  కూతురు ప్రత్యూష(16) ములుగులోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. ప్రత్యూషకు సోమవారం రాత్రి 10 గంటలకు కడుపునొప్పి తీవ్రంగా రావడంతో బాధ భరించలేక ఆల్‌అవుట్‌కు చెందిన లిక్విడ్‌ను తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ప్రత్యూషను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు మంగళవారం తెల్లవారుజామున ఎంజీఎం ఆస్పత్రికి  తరలిస్తుండగా మార్గమాధ్యలో మృతిచెందింది. మృతురాలికి సోదరితోపాటు సోదరుడు ఉన్నాడు. మృతురాలి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   
 
భార్య కాపురానికి రావడం లేదని..
 
కుందారం(లింగాలఘణపురం) : మండలంలోని కుందారంలో మంద వనరాజు(42) అనే వ్యక్తి తన ఇంట్లో మంగళవారం ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య గత కొన్ని రోజులుగా కాపురానికి రావడం లేదు. అతడి తల్లి, కూతురు ఇటీవల బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు  దూలానికి ఉరివేసుకున్నాడు. అంతేగాక అతడు ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నట్లు గ్రామస్తులు గ్రామస్తులు తెలిపారు. ఆత్మహత్యకు సరైన కారణాలు తెలియలేదు. 
 
మహిళ ఆత్మహత్య
 
చిట్యాల : కూతురి కాపురంలోని కలహాలతో కలత చెందిన ఓ మహిళ తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని టేకుమట్లలో మంగళవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల భారతి(48), లింగయ్య దంపతులకు కుమార్తెలు స్వర్ణలత, స్నేహలత, కుమారుడు క్రాంతికుమార్‌ ఉన్నారు. ఆరేళ్ల క్రితం మొగుళ్లపల్లి మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడితో స్వర్ణలతకు వివాహమైంది. ఆమె కుటుంబంలోని గొడవలతో రెండేళ్లుగా స్వర్ణలత తన తల్లిగారింట్లోనే ఉంటోంది. తన కుమార్తె కాపురం గురించి మనోవేదనకు గురైన భారతి కొంతకాలం క్రితం అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు  హెడ్‌కానిస్టేబుల్‌ సమ్మిరెడ్డి తెలిపారు. భారతి మృతితో టేకుమట్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
యువకుడి ఆత్మహత్య
 
హన్మకొండ చౌరస్తా : కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. హన్మకొండ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండలోని పోచమ్మకుంట ప్రాంతానికి చెందిన మంజల శ్రీకాంత్‌(29) రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న శ్రీకాంత్‌ రోజూ మాదిరిగానే సోమవారం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. మందులు వాడుతున్నా నొప్పి తగ్గడం లేదనే మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి రమ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement