తన రేషన్ కార్డును తొలగించారంటూ ఓ న్యాయవాది వినూత్న నిరసన చేపట్టాడు. తన గ్రామం నుంచి ముఖ్యమంత్రి సొంతూరు వరకు పాదయాత్ర చేస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నాడు.
ఒంగోలు క్రైమ్: తన రేషన్ కార్డును తొలగించారంటూ ఓ న్యాయవాది వినూత్న నిరసన చేపట్టాడు. తన గ్రామం నుంచి ముఖ్యమంత్రి సొంతూరు వరకు పాదయాత్ర చేస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన వీ గజేంద్రరావు ఈమేరకు పాదయాత్ర చేస్తున్నారు. జాతీయ జెండాను భుజాన వేసుకొని ఆదివారం ఉదయం వేటపాలెంలో బయలుదేరిన గజేంద్రరావు సోమవారం ఉదయం 11 గంటలకు ఒంగోలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లి వరకు ఆయన పాదయాత్ర కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు తెలియకుండా తన రేషన్కార్డు తొలగించారని, దీని గురించి పలుమార్లు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల డీఎస్పీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి.. జన్మభూమి గ్రామసభలో దరఖాస్తు ఇస్తానని చెప్పగా.. అలా ఇస్తే అరెస్టు చేస్తానని ఆయన బెదిరించినట్టు వెల్లడించాడు. తన రేషన్కార్డు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని, రద్దు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాదయూత్ర చేస్తున్నట్లు గజేంద్రరావు తెలిపారు