ఉలవ సాగుకు ఇదే అదను | agriculture story | Sakshi
Sakshi News home page

ఉలవ సాగుకు ఇదే అదను

Sep 5 2017 9:42 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఉలవ సాగుకు ఇదే అదను - Sakshi

ఉలవ సాగుకు ఇదే అదను

ఉలవ సాగుకు ఇది అనుకూలమైన సమయం.. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఉలవ సాగు చేసుకుంటే మేలైన దిగుబడి సాధించొచ్చు.

- ప్రత్యామ్నాయ పంటగానూ సాగు చేసుకోవచ్చు
- అధిక దిగుబడితోపాటు బలమైన గ్రాసం
- కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్‌ జాన్‌ సుధీర్‌  


అనంతపురం అగ్రికల్చర్‌: ఉలవ సాగుకు ఇది అనుకూలమైన సమయం.. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో ఉలవ సాగు చేసుకుంటే మేలైన దిగుబడి సాధించొచ్చు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పెసర, అలసంద, జొన్న లాంటి వాటితో పాటు ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేసుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ రైతులకు సూచించారు. చివరగా కురిసే వర్షాలకు, తర్వాత చలి మంచుకు ఈ పంట చేతికొస్తుందన్నారు. బలమైన పశుగ్రాసంతో పాటు రైతుకు ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నారు.  

ఇవీ విత్తన రకాలు:
    ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఉచితంగా అన్ని రకాల ప్రత్యామ్నాయ విత్తనాలతో పాటు ఉలవలు కూడా పంపిణీ చేస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని ఈ వర్షానికి పంట వేసుకోవాలి. హైబ్రిడ్‌ విత్తనాల విషయానికి వస్తే  పీడీయం–1 అనే రకం 105 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పి.జడ్‌.యం–1 రకం 90 నుంచి 95 రోజుల పంట. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. పీహెచ్‌జీ–62 రకం 85 రోజులకు వస్తుంది. ఎకరాకు ఆరు నుంచి ఆరున్నర క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. పి.హెచ్‌.జి–9 రకం 90 నుంచి 100 రోజులకు పంట పూర్తవుతుంది. ఎకరాకు ఆరు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్‌ మందుతో కలిపి విత్తన శుద్ధి చేయాలి.  

యాజమాన్యం:
    భూమిని బాగా దుక్కి చేసుకొని గొర్రుతో ఎకరాకు 8 నుంచి 10 కిలోలు విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిలో 12 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుంది. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీ మీటర్ల దూరం పాటించాలి. ఎకరాకు 10 కిలోల యూరియా, 65 కిలోల సూపర్‌ పాస్పేట్, 20 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ ఆఫ్‌ పొటాష్‌ ఎరువులను ఆఖరు దుక్కిలో విత్తే ముందు వేసుకోవాలి. విత్తిన 25 రోజుల నుంచి 35 రోజుల మధ్య నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు దంతులతో కలుపు నివారణ చేసుకోవాలి. పూత, పిందె ఏర్పడే సమయంలో కాయతొలుచు పురుగు పంటకు నష్టం కలుగజేస్తుంది. దీని నివారణకు 2 మి.లీ క్వినాల్‌ఫాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణంలో అధిక తేమ ఉండి రాత్రి,పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నివారణకు 1 గ్రాము కార్బండిజమ్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement