
దరఖాస్తులు తీసుకుంటున్న సిబ్బంది
- ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పనిచేయని సాఫ్ట్వేర్
- గిరిజన పట్టభద్రులకు తప్పని ఇక్కట్లు..
- రెండు నెలలుగా ఇదే పరిస్థితి..
- పట్టించుకోని అధికారులు..
ఉన్నత లక్ష్యంతో నెలకొల్పిన ఎంప్లాయిమెంట్ కార్యాలయం లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమవుతోంది. సరిగా పనిచేయని సాఫ్ట్వేర్తో సిబ్బంది సతమతమవుతున్నారు. గిరిజన అభ్యర్థులు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. కనీసం సాఫ్ట్వేర్ మరమ్మతులకు కూడా బడ్జేట్ లేకపోవడం విచారకరం. రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం శోచనీయం. ఇకనైనా పీఓ రాజీవ్ దీనిపై దష్టి సారించాల్సి ఉంది.
భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు తమ విద్యార్హతలను నమోదు చేసుకునేందుకు భద్రాచలం ఐటీడీఏలోనే ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నిర్లక్ష్యరాస్యులు మొదలుకొని, ఉన్నత విద్యనభ్యసించిన వారు కూడా ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. గతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాల భర్తీ భద్రాచలం ఎంప్లాయిమెంట్ ద్వారానే చేసేవారు. ఇక్కడ పేరు నమోదు చేసుకుంటే చాలు, నేరుగా ఇంటికి కాల్ లెటర్లు వచ్చిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. విద్య, వైద్య, రెవెన్యూ తదితర శాఖలోని ఉద్యోగాల ¿¶ ర్తీకి ఐటీడీఏ కేంద్రంగానే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. నిరుద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుతం దీని ద్వారా ఎటువంటి ఉద్యోగాల భర్తీ జరుగటం లేదు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలు, ఉద్యోగాల భర్తీకి తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలనే నిబంధన ఉంది. దీనికోసం గిరిజన అభ్యర్థులు క్వూ కడుతున్నారు.
తరచూ మొరాయిస్తున్న సాఫ్ట్వేర్..
ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా సాఫ్ట్వేర్ పనిచేయటం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఉపాధి కల్పన కార్యాలయం అనుసంధానంతో ఏ రోజుకారోజు ఉపాధి గుర్తింపు కార్డులను జారీ చేయాల్సి ఉంది. కానీ రెండు నెలలుగా కంప్యూటరైజ్డ్ గుర్తింపు కార్డులను ఇవ్వటం లేదు. కార్డులు అత్యవసమైనటువంటి వారికి కూడా ప్రత్యేకంగా రూపొందించిన నమూనాలో విద్యార్హతలను రాసి ఇస్తున్నారు. దీనిని కొన్ని సందర్భాల్లో అనుమతించటం లేదని గిరిజన నిరుద్యోగులంటున్నారు. రోజు వంద మంది వరకూ నిరుద్యోగులు వస్తుంటారు. కానీ ఇక్కడ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. కంప్యూటర్ హార్డ్డిస్క్ హైదరాబాద్ తీసుకెళ్లి మరమ్మతులు చేయించుకునేందుకు కూడా ఎటువంటి బడ్జెట్ లేకపోవటంతో రోజుల తరబడి అవి మూలనపడి ఉంటున్నాయి.
52వేల మంది నమోదు..
ఇప్పటి వరకూ ఇక్కడ 52వేల మంది అభ్యర్థులు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్హతతో 20,515 మంది, ఇంటర్తో 12,745 మంది, డిగ్రీ (బీఏ)విద్యార్హతతో 3వేలు, బీఎస్సీతో 2వేలు, బీకాంతో 2,432, బీఈడీతో 2,215, టీటీసీ 466, ఐటీఐ ఎలక్ట్రీషియన్ 1,663, ఐటీఐ ఫిట్టర్ 714, పదో తరగతి లోపు 2,204, కంప్యూటర్ కోర్సులతో 854, ఏఎన్ఎంలతో 608, జీఎన్ఎంలతో 185 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. నిర్లక్ష్యరాస్యులు సైతం ఏదో ఒక పని ఇప్పించాలంటూ 608 మంది అర్జీ పెట్టుకున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గిరిజన తెగల్లో కూడా నిరుద్యోగులు పెరగటంతో వారికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఐటీడీఏలో ప్రత్యేకంగా భవిత సెల్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వివిధ నగరాల్లో ఉన్న ప్రైవేటు కంపెనీల్లో గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రస్తుత పీఓ రాజీవ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అయితే ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేసి, దీని ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని గిరిజన యువత అంటున్నారు. ఆ దిశగా ఐటీడీఏ అధికారులు ఆలోచన చేయాలని కోరుతున్నారు.
సమస్యలపై దష్టి సారించాం..
జయదేవ్ అబ్రహం, డిప్యూటీ డైరక్టర్, టీడబ్ల్యూ
ఎంప్లాయిమెంట్ కార్యాలయంపై దష్టి సారించాం. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా సరిపడా సిబ్బందిని నియమించేలా ఏర్పాట్లు చేశాం. సాఫ్ట్వేర్ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. దానిని హైదరాబాద్ తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలి. అక్కడికి పంపించాం.