
‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు’: ఏఎస్పీ
సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వహణలో మూడు నెలలుగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాను.. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు.. అని మృతి చెందిన విశాఖ జిల్లా పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ తన చివరి లేఖలో పేర్కొన్నారు. దీనికితోడు సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను బట్టి ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు తెలిపారు. శశికుమార్ చనిపోయిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన ఏఎస్పీ రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. దానిలో కుటుంబానికి సంబంధించిన పలు సున్నితమైన అంశాలు ఉన్నందున అతని తల్లిదండ్రుల అనుమతితో తెరుస్తామని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం రాత్రి ప్రకటించారు.
ఆ మేరకు సీఐడీ అధికారులు శుక్రవారం లేఖను స్వాధీనం చేసుకొని వీఆర్వోల సమక్షంలో తెరిపించి, వారి చేతే చదివించారు. సంఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న వారితో పాటు అక్కడి సిబ్బందిని చింతపల్లి ఏఎస్పీ రాఘవేంద్ర విచారించారు. ముగ్గురు హోంగార్డులు, ఎస్సై సూర్యప్రకాష్తో పాటు గన్మెన్లు, స్వీపర్లతో సహా అందరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. కాగా కేజీహెచ్లో ఉన్న శశికుమార్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శుక్రవారం తెల్లవారుజామున నర్సీపట్నం ఓఎస్డీ అట్టాడ బాబూజీ దగ్గరుండి విమానంలో శశికుమార్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు.
డిపార్ట్మెంట్కు సూట్ కానని నోట్: సీఐడీ డీఎస్పీ వెల్లడి
ఏఎస్పీ శశికుమార్ తన రివాల్వర్తోనే కాల్చుకున్నారని, బయట నుంచి ఎవరో వచ్చి హత్య చేశారనేందుకు ఇప్పటి వరకూ తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని విచారణాధికారి అయిన సీఐడీ డీఎస్పీ వై.వి.నాయుడు చెప్పారు. సాక్షితో ఆయన మాట్లాడుతూ సంఘటన స్థలం నుంచి రివాల్వర్, బుల్లెట్, సూసైడ్ నోట్, డైరీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘మూడు నెలలుగా ఫెయిల్యూర్స్తో తీవ్ర డిప్రెషన్లో ఉన్నాను. నేను ఈ డిపార్ట్మెంట్కు పనికిరాను. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఐయామ్ సారీ’ అని శశికుమార్ పేరుతో ఉన్న లేఖలో రాసి ఉందని డీఎస్పీ వెల్లడించారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే ఖచ్చితమైన నిర్ధారణకు రాగలమన్నారు.